మరో మూడేళ్ల వరకు క్రికెట్ ఆడతా.. ఆ తర్వాతే నిర్ణయం తీసుకుంటా: కోహ్లీ

వెల్లింగ్టన్: కచ్చితంగా మరో మూడేళ్ల వరకు అన్ని ఫార్మాట్లలో క్రికెట్ ఆడతా. ఆ తర్వాత పరిస్థితులు భిన్నంగా ఉంటాయని తెలుసు. ఎటువంటి నిర్ణయాలనైనా మూడేళ్ల తర్వాతే తీసుకుంటా అని టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ స్పష్టం చేసాడు. 34-35 ఏళ్లలో నా శరీరం అధిక పని భారాన్ని తట్టుకోలేదు. కానీ.. వచ్చే రెండు, మూడేళ్ల వరకు ఎటువంటి ఇబ్బందులు ఉండవు అని కోహ్లీ చెప్పుకొచ్చాడు. భారత్-న్యూజిలాండ్ తొలి టెస్టు సందర్భంగా మంగళవారం కెప్టెన్లు విరాట్ కోహ్లీ, కేన్ విలియమ్సన్లు ట్రోఫీని వెల్లింగ్టన్లో ఆవిష్కరించారు. ఆపై ఇద్దరు ఫొటోలకు పోజులిచ్చారు.

మరో మూడేళ్లు ఆడతా:
ట్రోఫీని ఆవిష్కరణ అనంతరం విరాట్ కోహ్లీ మీడియా సమావేశంలో పాల్గొన్నారు. ఈ క్రమంలో 2021 టీ20 ప్రపంచకప్ తర్వాత ఏదైనా ఫార్మాట్ నుంచి తప్పుకుంటారా అని ఓ విలేకరి అడగ్గా... 'ప్రస్తుతం నా ఆలోచనా ధోరణి విస్తృతంగా ఉంది. ఇప్పటి నుంచి కఠినమైన మరో మూడేళ్ల వరకు క్రికెట్ ఆడటానికి సన్నద్ధమవుతున్నా. ఆ తర్వాత మన సంభాషణ వేరే విధంగా ఉంటుంది' అని సమాధానం ఇచ్చాడు. రాబోయే మూడు సంవత్సరాలలో రెండు టీ20 ప్రపంచకప్లు, ఒక వన్డే ప్రపంచకప్ ఉన్న విషయం తెలిసిందే.

300 రోజులు క్రికెట్ ఆడుతున్నా:
'ఇది మీకు తెలియని విషయం ఏమీ కాదు. గత ఎనిమిదేళ్లుగా సంవత్సరానికి దాదాపు 300 రోజులు క్రికెట్ ఆడుతున్నా. ఇందులో ప్రయాణాలు, ప్రాక్టీస్ సెషన్లు కూడా ఉన్నాయి. ఇది మనపై తీవ్రంగా ప్రభావం చూపుతుంది. అయితే.. ఆటగాళ్లు దాని గురించి ఆలోచించడం లేదని కాదు. తీరికలేని షెడ్యూల్లో కూడా మేం విరామం తీసుకుంటున్నాం. అన్ని ఫార్మాట్లలో ఆడే వాళ్లు కూడా తీసుకుంటున్నారు. నేను, రోహిత్ బ్రేక్ తీసుకున్నాం' అని కోహ్లీ తెలిపాడు.

మరో మూడేళ్ల వరకు ఇబ్బందులు ఉండవు:
'కెప్టెన్గా బాధ్యతలు నిర్వర్తించడం అంత తేలికైన విషయం కాదు. ప్రాక్టీస్ సెషన్లో కూడా దీని ప్రభావం ఉంటుంది. విరామాలు తీసుకుంటూ వీటిని అధిగమించాలి. నా వయసు ఇప్పుడు 31 ఏళ్లు. 34-35 ఏళ్లలో నా శరీరం అధిక పని భారాన్ని తట్టుకోలేదు. కానీ.. వచ్చే రెండు, మూడేళ్ల వరకు ఎటువంటి ఇబ్బందులు ఉండవు. వచ్చే మూడేళ్లలో జట్టుకు నా సహకారం ఎంతో అవసరమని తెలుసు. ఎటువంటి నిర్ణయాలనైనా ఆ తర్వాతే తీసుకుంటా. అది రెండు ఫార్మాట్లు ఆడుతానో లేదా మూడూ ఆడుతానో చూడాలి' అని కోహ్లీ పేర్కొన్నాడు.

టెస్టు ఛాంపియన్షిప్దే అత్యున్నత స్థాయి:
'నా దృష్టిలో ఐసీసీ నిర్వహించే అన్ని టోర్నమెంట్లలో టెస్టు ఛాంపియన్షిప్దే అత్యున్నత స్థాయి. అందుకే అన్ని జట్లు లార్డ్స్లో జరగనున్న ఫైనల్స్లో ఆడాలని ప్రయత్నిస్తాయి. ప్రస్తుతం అన్ని జట్లు పాయింట్లు సాధించే పనిలో పడ్డాయి. అన్ని జట్ల మాదిరిగానే మేము ఫైనల్లో ఆడాలని భావిస్తున్నాం' అని కోహ్లీ చెప్పుకొచ్చాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications