చివరి అవకాశంగా ఉండాలి:
బీసీసీఐ టీవీ కోసం మయాంక్ అగర్వాల్తో ఓ కార్యక్రమంలో పాల్గొన్న విరాట్ కోహ్లీ మాట్లాడుతూ... 'ఎలాంటి పరిస్థితుల్లోనూ నేను ఫలితం కోసం రాజీపడను. మ్యాచ్ను డ్రా చేసుకోవడం నాకు చివరి అవకాశంగా ఉండాలి. ఒకవేళ భారత్ గెలవడానికి చివరి రోజు ప్రత్యర్థి జట్టు 300 పరుగులు లక్ష్యంగా నిర్దేశిస్తే ఆటగాళ్లకు ఒకటే చెబుతా.. మనం ఆ స్కోరు కోసం ప్రయత్నిద్దామని అంటా. సెషన్కు వంద పరుగుల చొప్పున బాదితే సరిపోతుందని, ఒకవేళ తొలి సెషన్లో వికెట్లు కోల్పోయి 80 పరుగులే చేసినా.. చివరి సెషన్లో 120 పరుగులు చేద్దామని వివరిస్తా' అని అన్నాడు.
డ్రా చేసుకోవడం నచ్చదు:
'మ్యాచును డ్రా చేసుకోవడం నాకు నచ్చదు. పరిస్థితులు మరీ చేయిదాటిపోతే తప్ప దాని గురించి ఆలోచించను. చివరి గంటలో ఏం చేయలేని పరిస్థితుల్లో ఉంటే అప్పుడు డ్రా చేసుకోవాలని అనుకుంటా. ఒక ఆటగాడికి ఓడిపోతామనే భయమే అత్యంత ప్రతికూల అంశం, అది ఆ ఆటగాడి ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీస్తుంది. మ్యాచ్ను మలుపు తిప్పే ఘటనలు చోటుచేసుకుంటే.. ఆటగాళ్లు వావ్ అంటారు. నా లక్ష్యం ఒక్కటే.. టీమిండియాను చూసి ఎవరైనా ఎంత మంచి జట్టు అని మెచ్చుకోవాలి' అని భారత కెప్టెన్ చెప్పాడు.
2014లో టెస్టు కెప్టెన్సీ:
2014లో ఎంఎస్ ధోనీ టెస్టు కెప్టెన్సీ నుంచి తప్పుకున్నాక.. విరాట్ కోహ్లీ ఆ బాధ్యతలు చేపట్టిన సంగతి తెలిసిందే. ఇక అప్పటి నుంచీ ఇప్పటివరకు 55 టెస్టులకు నాయకత్వం వహించిన విరాట్.. 33 మ్యాచ్ల్లో విజయం సాధించాడు. దీంతో భారత్ తరఫున అత్యంత విజయవంతమైన టెస్టు సారథిగా ప్రత్యేక గుర్తింపు సాధించాడు. అలాగే కెప్టెన్గా 61.21 సగటుతో 5142 పరుగులు చేసిన కోహ్లీ.. 20 శతకాలు, 12 అర్ధ శతకాలు నమోదు చేశాడు.
ఏమైనా తింటున్నావా లేదా?
'నేను బక్కచిక్కిపోయినట్లు మా అమ్మ అంటుండేది. అయితే ప్రతీ తల్లి అలా అనుకోవడం సహజమే. "నువ్వు చాలా వీక్ అవుతున్నావు. ఏమైనా తింటున్నావా లేదా?" అని అడిగేది. మాతృమూర్తులకు తమ కుమారులపై ఉండే బెంగకు, ఆటగాళ్ల ప్రొఫెషనలిజమ్కి తేడా తెలియదు. వాళ్ల పిల్లలు లావుగా కనపడకపోతే ఏదో అయిపోయిందని కంగారు పడతారు' అని విరాట్ కోహ్లీ వివరించాడు. అలాగే తాను అనారోగ్యానికి గురయ్యానని కూడా తన తల్లి అంటుండేదని విరాట్ చెప్పుకొచ్చాడు. ఇలాంటి సన్నివేశాలు ఒక్కోసారి సరదాగా అనిపించినా ఒక్కోసారి చాలా చిరాకు తెప్పిస్తాయన్నాడు. తాను బాగా ఉన్నానని, ఆటకోసం అలా మారాల్సి వస్తోందని చెబుతానని చెప్పాడు.