
లండన్: బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ, చాపెల్-హ్యడ్లీ ట్రోఫీ, వార్న్-మురళీధరన్ ట్రోఫీ తరహాలో ఇప్పుడు మరో సిరీస్ను ఇద్దరు దిగ్గజ క్రికెటర్ల పేర్లతో వ్యవహరించనున్నారు. ఇంగ్లండ్-వెస్టిండీస్ జట్ల మధ్య ఇప్పటివరకు జరుగుతున్న విజ్డెన్ టెస్ట్ సిరీస్ పేరు.. 'రిచర్డ్స్-బోథమ్'గా మారనుంది. భవిష్యత్లో ఇంగ్లండ్, వెస్టిండీస్ మధ్య ఎక్కడ టెస్టు సిరీస్ జరిగినా.. ఇకపై విజేతకు 'రిచర్డ్స్-బోథమ్' ట్రోఫీని అందించనున్నారు.
ట్రోఫీ పేరు మార్పునకు ఇంగ్లండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు (ఈసీబీ), క్రికెట్ వెస్టిండీస్ బోర్డులు అంగీకరించాయి. ప్రపంచ క్రికెట్పై తమదైన ప్రత్యేక ముద్ర వేసిన ఇద్దరు స్టార్లను తగిన విధంగా గౌరవించుకునేంందుకు ఇరు బోర్డులు కలిసి ఈ నిర్ణయం తీసుకున్నాయి. ఇంగ్లండ్-విండీస్ మధ్య శుక్రవారం ప్రారంభమైన మూడో టెస్ట్ విజ్డెన్ సిరీ్సలో చివరిది కానుంది. దశాబ్దాల చరిత్ర గల విజ్డెన్ ట్రోఫీ కనుమరుగవుతుంది.
'క్రికెట్ బైబిల్'గా గుర్తింపు పొందిన ప్రఖ్యాత మ్యాగజైన్ 'విజ్డన్' 100 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా.. 1963లో ఇంగ్లండ్-విండీస్ క్రికెట్ జట్ల బోర్డులు కలిపి పెట్టిన పేరు (విజ్డెన్ సిరీస్) ఇన్నేళ్లు కొనసాగింది. ఇకపై ట్రోఫీ లార్డ్స్లోని ఎంసీసీ మ్యూజియంలో ఉంచుతారు. విండీస్కు చెందిన బ్యాటింగ్ దిగ్గజం సర్ వివియన్ రిచర్డ్స్, 121 టెస్టుల్లో 8,540 పరుగులు చేశాడు. అలాగే ఇంగ్లండ్ లెజండరీ ఆల్రౌండర్ సర్ ఇయాన్ బోథమ్ 102 టెస్టుల్లో 5200 పరుగులు, 383 వికెట్లు పడగొట్టాడు.
సిరీస్ ఫలితాన్ని నిర్ణయించే మూడో టెస్టులో తొలిరోజు ఇంగ్లండ్ తడబడి నిలబడింది. ఆరంభంలో వెస్టిండీస్ బౌలర్ల ధాటికి క్రమం తప్పకుండా వికెట్లు చేజార్చుకున్న ఇంగ్లండ్.. ఒలీ పోప్ (91 బ్యాటింగ్; 142 బంతుల్లో 114), జోస్ బట్లర్ (56 బ్యాటింగ్; 120 బంతుల్లో 54, 26) కీలక భాగస్వామ్యంతో కోలుకుంది. ఈ జోడీ అభేద్యమైన అయిదో వికెట్కు 136 పరుగులు జోడించడంతో శుక్రవారం ఆట ఆఖరికి ఇంగ్లిష్ జట్టు తొలి ఇన్నింగ్స్లో 85.4 ఓవర్లలో 4 వికెట్లకు 258 పరుగులు చేసింది. రోరీ బర్న్స్ (57) అర్ధసెంచరీ చేసి నిష్క్రమించగా.. డొమినిక్ సిబ్లీ (0), జో రూట్ (17), బెన్ స్టోక్స్ (20) తక్కువ స్కోర్లకే ఔటయ్యారు.