లోపాలను అధిగమించడానికి ఎంతో శ్రమించాం:
డబుల్ సెంచరీ చేసిన విరాట్ కోహ్లీకి 'ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్' దక్కింది. ఈ సందర్భంగా కోహ్లీ మీడియాతో మాట్లాడాడు. 'సుదీర్ఘ ఫార్మాట్లో అడుగుపెట్టినప్పుడు టెస్టు ర్యాంకింగ్స్లో ఏడో స్థానంలో ఉన్నాం. అప్పుడు కొన్ని విభాగాల్లో చాలా బలహీనంగా ఉన్నాం. వాటిని అధిగమించడానికి ఎంతో శ్రమించాం. జట్టులోని ప్రతి ఒక్కరు విజయాల్లో కీలక పాత్ర పోషిస్తున్నారు. ప్రస్తుతం మంచి స్థితికి చేరుకున్నాం' అని అన్నాడు.
విజయాలకు కారణం జట్టు సభ్యులే:
'గత నాలుగేళ్ల నుంచి భారత జట్టు అద్భుత విజయాలు సాధిస్తున్నామంటే దానికి కారణం జట్టు సభ్యులే. మరింతగా రాణించాలని అందరూ నిరంతరం కృషి చేస్తున్నారు. జట్టు ప్రదర్శనపై చాలా సంతోషంగా ఉంది. ముఖ్యంగా బౌలర్లు అద్భుతంగా రాణిస్తున్నారు. పేస్ విభాగం పటిష్టంగా ఉంది. జట్టు ఒక్కరిపై ఆడదారపడకుండా ఉండడం సొంతోషించదగిన విషయం' అని కోహ్లీ పేర్కొన్నాడు.
ఆ ఆలోచన ధోరణితోనే పరుగులు చేస్తున్నా:
'జట్టును ముందుకు నడిపించాలనే ఆలోచన ధోరణితోనే భారీ స్కోరులు నమోదుచేస్తున్నాను. ఈ క్రమంలోనే సెంచరీలు చేస్తున్నా. జట్టుకు విజయాలలో కీలకపాత్ర పోషిస్తున్నందుకు ఆనందంగా ఉంది. ప్రత్యర్థిపై పైచేయి సాధించడమే మా ధ్యేయం. తొలి ఇన్నింగ్స్లో రహానేతో కలిసి జోడించిన భాగస్వామ్యమే మ్యాచ్ను మనవైపు మొగ్గేలా చేసింది' అని కోహ్లీ తెలిపాడు.
రిలాక్స్ అయ్యే ప్రసక్తే లేదు:
'ప్రపంచ టెస్టు చాంపియన్షిప్లో ఆడే ప్రతి మ్యాచ్ కీలకమే. అది సొంతగడ్డపై అయినా.. విదేశాల్లోనైనా పాయింట్లు సమానమే. మూడో టెస్టులోనూ ఇదే తీవ్రత కొనసాగిస్తాం. రిలాక్స్ అయ్యే ప్రసక్తే లేదు. జోరు కనబరుస్తూ సిరీస్ క్లీన్స్వీప్ చేయడమే మా ముందున్న లక్ష్యం' అని కోహ్లీ చెప్పుకొచ్చాడు. 50 టెస్టులకు సారథ్యం వహించిన కోహ్లీ.. విజయవంతమైన కెప్టెన్ల జాబితాలో మూడో స్థానంలో ఉన్నాడు. తొలి 50 టెస్టుల్లో స్టీవ్ వా 37, రికీ పాంటింగ్ 35 విజయాలతో కోహ్లీ కంటే ముందున్నారు.