మరీ చెత్తగా ఆడలేదు:
మ్యాచ్ అనంతరం జరిగిన బహుమతి ప్రధానోత్సవంలో విరాట్ కోహ్లీ మాట్లాడాడు. 'ఈ సిరీస్లో స్కోర్లను చూస్తుంటే.. మరీ చెత్తగా ఆడామని చెప్పలేం. కానీ.. అవకాశాలను అందిపుచ్చుకోలేదు. అందువల్లే సిరీస్ ఓడిపోయాం. అంతర్జాతీయ మ్యాచ్లు గెలవాలంటే వన్డే సిరీస్లో మేం చూపించిన ఈ పోటీతత్వం సరిపోదు. బంతితో మలుపులు తిప్పలేకపోయాం. ఫీల్డింగ్లోనూ అంత చురుగ్గా లేం. చెత్తగా ఆడలేదు కానీ అవకాశాలను ఒడిసిపట్టకపోతే గెలిచేందుకు అర్హత ఉండదు' అని అన్నాడు.
న్యూజిలాండ్ కసితో ఆడింది:
'కఠిన పరిస్థితుల్లో బ్యాట్స్మెన్ పరుగులు సాధించడం టీమిండియాకు సానుకూలాంశం. మేం బౌలింగ్, ఫీల్డింగ్ల్లో చేసిన తప్పిదాలు మ్యాచులు గెలిపించలేదు. టీ20 సిరీస్ ఓటమి తర్వాత న్యూజిలాండ్ వన్డే సిరీస్లో మరింత కసిగా ఆడింది. అయితే మేము అంతే పట్టుదల, కసిగా ఆడలేకపోయాం. కొత్త ఆటగాళ్లకు ఈ సిరీస్ మంచి అనుభవం' అని కోహ్లీ తెలిపాడు.
టెస్ట్ సిరీస్ గెలవగలం:
'టెస్టు ఛాంపియన్షిప్లో ప్రతి మ్యాచ్ కీలకమే. సుదీర్ఘ ఫార్మాట్లో మాకు మంచి జట్టు ఉంది. మేం ఆ సిరీస్ గెలవగలం. ఐతే మేం సరైన మానసిక ధోరణితో మైదానంలో అడుగుపెట్టాలి. ప్రణాళికలు రచించాలి' అని కోహ్లీ చెప్పుకొచ్చాడు. రెండు టెస్ట్ల సిరీస్ ఫిబ్రవరి 21 నుంచి ప్రారంభం కానుంది. రెండో టెస్ట్ 29న మొదలవనుంది. అంతకుముందు ఫిబ్రవరి 14 నుండి మూడు రోజుల ప్రాక్టీస్ మ్యాచ్ ఉంది.
భారత్ ఓటమి:
తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 296 పరుగులు చేసింది. లోకేష్ రాహుల్ సెంచరీ (113 బంతుల్లో 112; ఫోర్లు 9, సిక్సులు 2)తో చెలరేగగా.. శ్రేయస్ అయ్యర్ (63 బంతుల్లో 62; ఫోర్లు 9) హాఫ్ సెంచరీతో రాణించాడు. కివీస్ బౌలర్ బెన్నెట్ 4 వికెట్లు తీసాడు. 297 పరుగుల లక్ష్యంను కివీస్ 47.1 ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయి ఛేదించింది. మార్టిన్ గప్టిల్ (46 బంతుల్లో 66: 6 ఫోర్లు, 4 సిక్సర్లు), హెన్రీ నికోల్స్ (103 బంతుల్లో 80: 9 ఫోర్లు), కొలిన్ డి గ్రాండ్హోమ్ (28 బంతుల్లో 58: 6 ఫోర్లు, 3 సిక్సర్లు) హాఫ్ సెంచరీలు చేసి కివీస్ విజయంలో కీలక పాత్ర పోషించారు. భారత బౌలర్ చహల్ మూడు వికెట్లు తీసాడు.