సిడ్నీ: టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ అద్భుతమైన ఆటగాడని, క్రికెట్కు అతడు చాలా చేశాడని ఆస్ట్రేలియా మాజీ సారథి స్టీవ్ స్మిత్ అన్నాడు. క్రికెట్కు కోహ్లీ అందం తీసుకొచ్చాడన్నాడు. లక్ష్య చేధనలో ఎంత ఒత్తిడి ఉన్నా.. కోహ్లీ ఎంతో ప్రశాంతంగా అద్భుతంగా ఆడతాడని సోమవారం ఓ టీవీ ఇంటర్వ్యూలో స్మిత్ అన్నాడు. ఎంతో కాలంగా కోహ్లీ, స్మిత్ని పోలుస్తూ చాలా మంది వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే.
కోహ్లీ అంటే గౌరవమే కానీ.. భయం కాదు: యువ పేసర్
'విరాట్ కోహ్లీ అంటే నాకు చాలా గౌరవం. అతను అద్భుతమైన ఆటగాడు. అసాధ్యమైన రికార్డులు సాధించాడు. అతను ఇండియా కోసం ఎంతో చేశాడు. భారత జట్టు ఇప్పుడు ఆడుతున్న విధానం వెనుక విరాట్ కోహ్లీ తపన ఎంతో ఉంది' అని స్మిత్ అన్నాడు. కోహ్లీ ఎంతో పట్టుదల ఉన్న వ్యక్తి అని, ఎంతో కష్టపడి తన శరీరాన్ని ఫిట్గా మార్చుకున్నాడని స్మిత్ పేర్కొన్నాడు. 'విరాట్ ఫిట్ మరియు బలవంతమైన వ్యక్తి. క్రికెటె్కి అతను అందం తీసుకొచ్చాడు. ముఖ్యంగా వైట్-బాల్ క్రికెట్లో అతను ఛేజింగ్ చేసే విధానానికి నేను అభిమానిని. వన్డేల్లో విరాట్ యావరేజ్ అత్యద్భుతం. ఎంత ఒత్తిడిలో అయినా.. ప్రశాంతంగా ఉంటూ పని పూర్తిచేస్తాడు. అలాంటి వ్యక్తిని మనం గౌరవించుకోవాలి' అని స్మిత్ అన్నాడు.
తాను అంతర్జాతీయ క్రికెట్లో మళ్లీ బౌలింగ్ చేయాలనుకుంటే.. విరాట్ కోహ్లీని ఔట్ చేయాలని అనుకుంటానని స్మిత్ చెప్పాడు. విరాట్ కోహ్లీ, స్టీవ్ స్మిత్ ఈ తరానికి చెందిన అత్యుత్తమ బ్యాట్స్మెన్లు అనడంలో ఎటువంటి సందేహం లేదు. వీరిద్దరు ఇప్పటికే తమ కెరీర్లో ఎన్నో రికార్డులు సాధించారు. ఓ వైపు కోహ్లీ వన్డేల్లో నెం.1 ర్యాంకులో ఉంటే.. మరోవైప టెస్టుల్లో నెం.1 ర్యాంకులో స్టీవ్ స్మిత్ ఉన్నాడు. కోహ్లీ, స్మిత్లలో ఎవరు అత్యుత్తమ బ్యాట్స్మెన్ అనే విషయంపై ఎప్పటినుంచో చర్చ జరుగుతోంది.
కరోనా వైరస్ కారణంగా విధించిన లాక్డౌన్తో రెండు నెలలకు పైగా ఇంటికి పరిమితమైన ఆస్ట్రేలియా ఆటగాళ్లు ప్రాక్టీస్ను మళ్లీ ప్రారంభించారు. సిడ్నీ ఒలింపిక్ పార్క్లో సోమవారం కసరత్తులు చేశారు. స్టీవ్ స్మిత్, డేవిడ్ వార్నర్, మిచెల్ స్టార్క్ ప్రాక్టీస్లో పాల్గొన్నారు. ఆస్ట్రేలియాలో కరోనా ప్రభావం కాస్త తక్కువగానే ఉంది. ఆ దేశంలో ఇప్పటి వరకు దాదాపు 7వేల కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో ఆసీస్ ప్రభుత్వం ప్లేయర్లు ఔట్డోర్ ప్రాక్టీస్ చేసుకునేందుకు అనుమతిచ్చింది.