హైదరాబాద్: కెప్టెన్ కోహ్లి దూకుడు భారత జట్టుకి ప్రమాదమని దక్షిణాఫ్రికా మాజీ క్రికెటర్ కలిస్ అభిప్రాయపడ్డాడు. ఈ నేపథ్యంలో కెప్టెన్ మైదానంలో ప్రవర్తన మార్చుకోవాలని సౌతాఫ్రికా స్టార్ ఆల్రౌండర్ జాక్వెస్ కలీస్ సూచించాడు. ప్రస్తుతం సఫారీ గడ్డపై పర్యటిస్తున్న భారత్ జట్టు టెస్టు సిరీస్ని 1-2తో చేజార్చుకున్నా.. ఆరు వన్డేల సిరీస్ని ఒక వన్డే మిగిలి ఉండగానే 4-1తో చేజిక్కించుకున్న విషయం తెలిసిందే.
ఈ రెండు జట్ల మధ్య ఆరో వన్డే శుక్రవారం జరగనుంది. ఈ నేపథ్యంలో గురువారం మీడియాతో మాట్లాడిన కలిస్.. 'భారత జట్టు పూర్తిస్థాయి కెప్టెన్సీ బాధ్యతల్ని విరాట్ కోహ్లి అందుకుని ఏడాదే పూర్తయింది. నాయకుడిగా అతను ఇంకా నేర్చుకోవాల్సింది చాలా ఉంది. ఒక బ్యాట్స్మెన్గా విరాట్ కోహ్లి దూకుడుగా ఉంటే తప్పులేదు' అని భావిస్తున్నట్లు తెలిపాడు.
ఇంకా మట్లాడుతూ.. 'వాస్తవంగా చెప్పాలంటే.. ఆ దూకుడుతోనే అతను అత్యుత్తమంగా రాణిస్తున్నాడు. కానీ.. ఒక కెప్టెన్గా మాత్రం ఆ దూకుడు జట్టుకి మంచి చేయదు. కాబట్టి.. మైదానంలో కొంచెం సహనంతో ఉండటాన్ని కోహ్లి అలవర్చుకోవాలి' అని కలిస్ సూచించాడు.
మరోవైపు టీమిండియా ఫాస్ట్బౌలర్లపై ప్రశంసలు కురిపించాడు. ఈసారి వాళ్లు మంచి ప్రదేశాల్లో బంతులేశారు. విదేశీ పిచ్లపై ఇలానే బౌలింగ్ చేయాలి. 25ఏళ్లలో ఏ భారత జట్టుకు సాధ్యం కానీ సిరీస్ విజయాన్ని దూకుడునే ఆయుధంగా చేసుకొని విరాట్సేన రికార్డు సృష్టించిన విషయం తెలిసిందే.
ఇక, భవిష్యత్లో భారత జట్టు మరింత మెరుగ్గా తయారవుతుందని కలిస్ అన్నాడు. భారత్ విదేశాల్లో తమ రికార్డును మెరుగుపరుచుకునే ప్రయత్నం చేస్తోందని, ముఖ్యంగా తమకు అలవాటు లేని బౌన్సీ వికెట్లపై రాణించడంపై దృష్టి పెట్టిందని అన్నాడు. తాజాగా జరుగుతున్న వన్డే సిరీస్లో రెండు సెంచరీలు చేసిన కోహ్లి.. దక్షిణాఫ్రికా గడ్డపై ద్వైపాక్షిక సిరీస్ గెలిచిన తొలి భారత కెప్టెన్గా రికార్డు నెలకొల్పాడు.