సెల్ఫీ కోసం వెంటపడిన అమ్మాయి
కరోనా కారణంగా భారత్-దక్షిణాఫ్రికా జట్ల మధ్య మార్చి 12 నుంచి 18 వరకూ జరగాల్సిన మూడు వన్డేల సిరీస్ని భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) గత శుక్రవారం రద్దు చేసిన విషయం తెలిసిందే. సిరీస్ అర్ధంతరంగా ఆగిపోవడంతో.. టీమిండియా ఆటగాళ్లు తమ స్వస్థలాలకి వెళ్లిపోయారు. ఈ క్రమంలో లక్నో నుంచి ముంబై విమానాశ్రమానికి విరాట్ కోహ్లీ చేరుకున్నాడు. విమానాశ్రయంలో భారీ భద్రత నడుమ కోహ్లీ నడుచుకుంటూ వెళ్తుండగా.. అక్కడే ఉన్న ఓ అమ్మాయి సెల్ఫీ కోసం ప్రయతించింది.
— Anpadh educated (@PRINCE3758458) March 19, 2020 |
తప్పించుకున్న కోహ్లీ
అమ్మాయి తన సెల్ఫోన్తో కోహ్లీ సెల్ఫీ కోసం ప్రయతించింది. అయితే ఆ అమ్మాయి తనవైపు రావడాన్ని ముందే చూసిన కోహ్లీ.. అటువైపుగా చూడకుండా ముందుకు వెళ్లిపోయాడు. ఇక చేసేదేంలేక ఆ అమ్మాయి వెనక్కి వెళ్ళిపోయింది. కరోనా కారణంగా కోహ్లీతో సెల్ఫీ కోసం ప్రయత్నించి ఆ అమ్మాయి భంగపాటుకి గురైంది. కరోనా వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతుండడంతో అభిమానులతో కరచాలనం, సెల్ఫీలకి దూరంగా ఉండాలని బీసీసీఐ ఆటగాళ్లకి ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే.
స్వీయ నిర్బంధంలో కోహ్లీ దంపతులు
కరోనాను అరికట్టడానికి ఎవరికి వారు స్వీయ నిర్బంధంలో ఉండాలని విరాట్ కోహ్లీ దంపతులు అభిమానులకు పిలుపునిచ్చారు. తాజాగా కోహ్లీతో కలిసి అనుష్క శర్మ ఓ వీడియో రూపొందించారు. దాన్ని ఆమె ట్విటర్లో షేర్ చేయగా.. కోహ్లీ రీట్వీట్ చేశాడు. మనమంతా ప్రస్తుతం కఠిన పరిస్థితులను ఎదుర్కొంటున్నామని, వైరస్ను అరికట్టాలంటే ప్రజలంతా సమష్టిగా కృషి చేయాలన్నారు. అందరి క్షేమం కోసం తామిద్దరం ఇంట్లోనే స్వీయ నిర్బంధంలో ఉంటున్నామని, ప్రజలు కూడా స్వచ్ఛందంగా ఇళ్లలోనే ఉండాలని పిలుపునిచ్చారు. అందరూ ఇళ్లలోనే ఉంటూ ఆరోగ్యంగా ఉండి వైరస్ వ్యాప్తిని నివారించాలని కోరారు.
మోదీని ఫాలో అవుదాం
కోహ్లీ అంతకుముందు ప్రధాని నరేంద్ర మోదీ గురువారం సూచించిన 'జనతా కర్ఫ్యూ' కార్యక్రమంపైనా స్పందించాడు. కరోనా వైరస్ వల్ల కలిగే ప్రమాదంను ఎదుర్కోడానికి సిద్ధంగా ఉండండి. అందరూ తగిన జాగ్రత్తలు తీసుకోండి. మనమంతా బాధ్యతాయుతమైన పౌరులం. మన ఆరోగ్య భద్రత కోసం ప్రధాని మోదీ సూచనలను పాటిద్దాం. ప్రపంచ వ్యాప్తంగా బాధితులను కాపాడుతున్న వైద్య సిబ్బందికి నా ప్రత్యేక కృతజ్ఞతలు. వ్యక్తిగత శుభ్రత, పరిసరాల శుభ్రత పాటించి మనం ఆరోగ్యంగా ఉండి వారికి సహకరిద్దాం' అని కోహ్లీ పేరొన్నాడు.