ఎప్పుడూ భారీ అంచనాలు:
ఇటీవలే ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ కెవిన్ పీటర్సన్, విరాట్ కోహ్లీల మధ్య ఇన్స్టాగ్రామ్ లైవ్చాట్ జరిగిన విషయం తెలిసిందే. ఆర్సీబీ ఐపీఎల్ టైటిల్ ఎందుకు గెలలేదు అని కోహ్లీని పీటర్సన్ ప్రశ్నించాడు. 'ఆర్సీబీ ప్రతి ఏడాది స్టార్ ఆటగాళ్లతో కళకళలాడుతూ ఉంటుంది. దీని వల్ల అభిమానుల్లో మాపై ఎప్పుడూ భారీ అంచనాలు ఉంటాయి. ఈసారైనా గెలుస్తారంటూ అభిమానులు అనుకోవడం వల్ల ప్రతి మ్యాచ్లో ఒత్తిడి నెలకొంటుంది' అని కోహ్లీ తెలిపాడు.
అదృష్టం కలిసి రాలేదు:
'ఇటీవల కాలంలో నాపై అదనంగా ఒత్తిడి పెంచిన వాటిలో ఐపీఎల్ ఒకటి. టైటిల్ గెలవడానికి ఇదే సరైన సీజన్ అని ప్రతి ఏడాదీ అనుకుంటూ ఉంటాం. కానీ.. మా ఆశలు ఎంతకూ నెరవేరట్లేదు. ఆర్సీబీ తరఫున డివిలియర్స్, గేల్ గొప్పగా ఆడారు. జట్టులోని అందరూ శ్రమిస్తున్నారు. స్టార్లు అందుబాటులో ఉన్నా టైటిల్ గెలవలేకపోయాం. మూడుసార్లు ఫైనల్కు వెళ్లాం. కానీ.. అదృష్టం కలిసి రాలేదు. ఈ ఏడాదిని ట్రోఫీని గెలుచుకునే సీజన్గా భావించాం. కరోనా కారణంగా టోర్నీ జరగడంపైనే అనుమానులున్నాయి. ఆర్సీబీ కప్ గెలిచేందుకు అన్ని అర్హతలు ఉన్నాయి' అని విరాట్ చెప్పాడు.
ఎప్పటికి మరిచిపోలేని ఇన్నింగ్స్:
'2016లో కింగ్స్ ఎలెవన్ పంజాబ్తో జరిగిన మ్యాచ్లో 50 బంతుల్లో 113 పరుగులు చేయడం నా ఐపీఎల్ కెరీర్లో ఎప్పటికి మరిచిపోలేని ఇన్నింగ్స్. పంజాబ్తో మ్యాచ్లో నేను అనుకున్న రీతిలో బ్యాటింగ్ చేయడాన్ని ఆస్వాదించాను. దక్షిణాఫ్రికాలో జరిగిన 2009-10 సీజన్లో నీతో (పీటర్సన్)తో పాటు కలిస్, బౌచర్, అనిల్ భాయ్, రాబిన్తో కలిసి ఆర్సీబీకి ఆడటం నాకు చిరకాలం గుర్తుంటుంది' అని కోహ్లీ చెప్పుకొచ్చాడు. కరోనా వైరస్ కారణంగా ఐపీఎల్ను బీసీసీఐ ఈనెల 15 వరకు వాయిదా వేసిన సంగతి తెలిసిందే.