హైదరాబాద్: టీమిండియా మాజీ సారథి మహేంద్ర సింగ్ ధోనీ, ప్రస్తుత సారథి విరాట్ కోహ్లీతో కలిసి ఆడటం ఆనందంగా ఉండడమే కాదు. అదొక గొప్ప విషయమని అభిప్రాయపడ్డాడు యువ చైనామన్ బౌలర్ కుల్దీప్ యాదవ్. ఒక క్రికెటర్గా, బౌలర్గా తన ఎదుగుదలలో ఎంఎస్ ధోనీ కీలక పాత్ర పోషించాడని తెలిపాడు. మైదానంలో వికెట్ల వెనకాల ఉంటూ బ్యాట్స్ మెన్ తర్వాత ఏ షాట్ కొడదామనుకుంటున్నాడో ముందుగానే ఊహించి చెప్పగలిగే మహీని తెగ పొగిడేస్తున్నాడు.
ఇటీవల స్టంప్ మైక్ ద్వారా బయటికి వచ్చిన రికార్డింగ్లు సోషల్ మీడియాలో బాగానే చక్కర్లు కొడుతున్నాయి. అయితే వీరిద్దరినీ కొనియాడుతూ.. కోహ్లీ, ధోనీలను జట్టుకు మూలస్తంభాలుగా పేర్కొన్నాడు. ఎప్పటికప్పుడు కొత్త ఆలోచనలతో కొత్త ఉత్సాహంతో ఉండే కోహ్లీని చూసి చాలా నేర్చుకోవాలని పేర్కొన్నాడు.
'మహీ భాయ్ ఒక దిగ్గజం. టీమిండియా తరఫున 300 పైగా వన్డేలు ఆడాడు. జట్టుకు ఏంతో సేవ చేశాడు. ఆయనతో కలిసి ఆడటం మాకు గర్వ కారణం. వికెట్ల వెనకాలే ఉంటూ మాకెంతో స్ఫూర్తి కలిగిస్తాడు. ప్రతిదీ చూసుకుంటూ అన్ని వేళలా మనకు మార్గదర్శిగా ఉంటాడు' అని కుల్దీప్ అన్నాడు.
టీమిండియా ఆటతీరును కోహ్లీ పూర్తిగా మార్చేశాడని కుల్దీప్ పేర్కొన్నాడు. 'విరాట్ను చూసి మనమెంతో నేర్చుకోవచ్చు. జట్టంగా కలిసికట్టుగా ఆడి గొప్పగా పోరాడాలని భావిస్తాడు. గత రెండేళ్లుగా సారథ్యం వహిస్తూ జట్టు దృక్ఫథాన్నీ, ఆటతీరునూ మార్చేశాడు. యువ ఆటగాళ్లను ప్రోత్సహిస్తున్నాడు. అతడు నన్నెంతో ప్రోత్సహిస్తాడు. సారథి మనల్ని విశ్వసిస్తే చాలా బాగుంటుంది. అప్పుడు మనం ఇంకా సులభంగా పనిచేయగలం' అని కుల్దీప్ అభిప్రాయపడ్డాడు.