హైదరాబాద్: ఆధునిక క్రికెట్ ప్రపంచంలో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ అత్యుత్తమ క్రికెటర్ అని ఆస్ట్రేలియా లెజెండరీ స్పిన్నర్ ప్రశంసల వర్షం కురిపించాడు. దక్షిణాఫ్రికా స్టార్ క్రికెటర్ ఏబీ డివిలియర్స్ కంటే కోహ్లీనే అత్యుత్తమ క్రికెటర్ అని కొనియాడాడు.
ఈ మధ్య కాలంలో విరాట్ కోహ్లీ సృష్టించిన రికార్డులే అతడిని అగ్రస్థానంలో నిలిపాయని షేన్ వార్న్ అన్నాడు. ఫార్మాట్ ఏదైనా సరే వరుస సెంచరీలతో సత్తా చాటుతున్న కోహ్లీ ప్రస్తుత ప్రపంచ క్రికెట్లో నంబర్ వన్ ఆటగాడని కితాబిచ్చాడు.
బ్యాటింగ్ దిగ్గజాలు వివ్ రిచర్డ్స్, సచిన్ టెండూల్కర్, బ్రియాన్ లారాల కలయికే విరాట్ కోహ్లీ అని పూణెలో 'స్పోర్ట్ టేల్' కార్యక్రమానికి హాజరైన వార్న్ పేర్కొన్నాడు. 'విరాట్ కోహ్లి వరల్డ్ నంబర్ వన్ ఆటగాడు. చాలా వేగంగా సెంచరీలు చేస్తూ దూసుకుపోతున్నాడు. వెస్టిండీస్ దిగ్గజ ఆటగాడు వీవ్ రిచర్డ్స్, భారత మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్లతో పోల్చదగిన ఒకే ఒక్క క్రికెటర్ కోహ్లీ' అని వార్న్ చెప్పాడు.
2016లో అత్యధిక పరగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో విరాట్ కోహ్లీ ముందున్నాడు. దీంతో పాటు వరుసగా నాలుగు టెస్టుల్లో నాలుగు డబుల్ సెంచరీలు సాధించి క్రికెట్ దిగ్గజాలైన సర్ డాన్ బ్రాడ్మన్, రాహుల్ ద్రవిడ్ల రికార్డుని అధిగమించిన సంగతి తెలిసిందే.
'నేను కోహ్లీకి పెద్ద అభిమాన్ని. అతని బ్యాటింగ్ చూడటం నాకు చాలా ఇష్టం. కెప్టెన్గా విరాట్ కోహ్లి దూకుడును కూడా ఇష్టపడతా. ఒక క్రికెటర్గా కోహ్లీ అంటే నాకు అభిమానం. అతనొక భిన్నమైన ఆటగాడు' అని వార్న్ తెలిపాడు.
నాలుగు టెస్టుల బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో భారత క్రికెట్ జట్టే ఫేవరెట్ అని వార్నర్ జోస్యం చెప్పాడు. టీమిండియాను స్వదేశంలో ఓడించడం ఆస్ట్రేలియాకు అంత సులువు కాదని వార్న్ పేర్కొన్నాడు. ఈ సిరిస్ కచ్చితంగా స్టీవ్ స్మిత్ సేనకు పరీక్ష లాంటిదేనని వార్న్ అన్నాడు.