హైదరాబాద్: గత ఇంగ్లాండ్ పర్యటనలో పేలవ ప్రదర్శనతో నిరాశపరిచిన కోహ్లీ, ప్రస్తుతం జరిగే ఐదు టెస్టు మ్యాచ్ల సిరిస్లో సత్తా చాటుతాడని టీమిండియా మాజీ కెప్టెన్ అజహరుద్దీన్ పేర్కొన్నాడు. ఇరు జట్ల మధ్య ఆగస్టు 1 నుంచి ఐదు టెస్టు మ్యాచ్ల సిరిస్ ప్రారంభం కానుంది.
ఈ నేపథ్యంలో అజహరుద్దీన్ మాట్లాడుతూ "అప్పటి సిరీస్తో పోల్చుకుంటే ప్రస్తుతం కోహ్లీ ఆటలో చాలా మార్పులు వచ్చాయి. అతను పూర్తి స్థాయి ఆటను ప్రదర్శించడానికి సిద్ధంగా ఉన్నాడు. ఇక కెప్టెన్గా ఇంగ్లాండ్లో అతనికిది తొలి పర్యటనే. కానీ ఈసారి కచ్చితంగా బ్యాట్తో అద్భుతంగా రాణించగలడు" అని పేర్కొన్నాడు.
"మరోవైపు కెప్టెన్గా ఇప్పటికే చాలా టెస్టులాడటంతో అతనిపై ఎలాంటి ఒత్తిడి ఉండదు" అని అన్నాడు. బౌలింగ్ విషయానికి వస్తే, పేసర్లు విజృంభిస్తే ఇరు జట్లలోనూ బ్యాట్స్మెన్ తప్పకుండా ఇబ్బంది పడతారు. అయితే ఇంగ్లాండ్లో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులు భారత్కే విజయావకాశాలు ఎక్కువగా ఉన్నాయని అన్నాడు.
ఇటీవల కోహ్లీని ఉద్దేశించి ఆండర్సన్ చేసిన వ్యాఖ్యలపై అజహరుద్దీన్ స్పందించాడు. "క్రికెట్ అనేది వ్యక్తిగత క్రీడ కాదు. ఇందులో ప్రతి ఒక్కరూ ఆడాల్సిందే. అంతేకానీ ఏ ఒక్క ఆటగాడిపై ఆధారపడి విజయం సాధించలేం" అని అజహరుద్దీన్ అన్నాడు.
కాగా, 2014లో ఇంగ్లాండ్ పర్యటనకు వెళ్లిన కోహ్లీ 5 మ్యాచ్లాడి కేవలం 134 పరుగులు చేశాడు. అప్పటి సిరిస్లో కోహ్లీ ఒక్క హాఫ్ సెంచరీ కూడా చేయలేకపోయాడు. అంతేకాదు ఇంగ్లిష్ బౌలర్లను ఎదుర్కోవడంలోనూ కోహ్లీ తీవ్రంగా ఇబ్బంది పడ్డాడు. ఆ పర్యటనలో ఆండర్సన్ బౌలింగ్లో కోహ్లీ నాలుగు సార్లు ఔటయ్యాడు.
ఆ తర్వాత మళ్లీ కెప్టెన్గా ఇంగ్లాండ్ గడ్డపై అడుగుపెట్టిన కోహ్లీ ఇప్పటికే ముగిసిన పరిమిత ఓవర్ల సిరిస్లో ఫరవాలేదనిపించాడు. మొత్తం ఆరు మ్యాచ్లాడి(మూడు టీ20లు, మూడు వన్డేలు) 301పరుగులు సాధించాడు.