హాఫ్ సెంచరీ కాకముందే సంబరాలు:
విశాఖ వన్డేలో ఓ సరదా సన్నివేశం చోటుచేసుకుంది. టీమిండియా యువ ఆటగాడు శ్రేయస్ అయ్యర్ వన్డేల్లో ఆరవ హాఫ్ సెంచరీ చేసిన విషయం తెలిసిందే. అయితే 49 పరుగుల వద్ద ఉన్నపుడే హాఫ్ సెంచరీ అయిందనుకుని అయ్యర్ సంబరాలు చేసుకున్నాడు. విండీస్ బౌలర్ కీమో పాల్ 48వ ఓవర్ వేస్తున్నాడు. ఆ ఓవర్లోని రెండో బంతిని విసరగా.. అయ్యర్ షాట్ ఆడి సింగల్ పూర్తి చేసాడు. అప్పుడు అయ్యర్ 27 బంతుల్లో 49 పరుగులతో ఉన్నాడు.
నవ్వుకున్న కోహ్లీ :
సింగల్ తీసి హాఫ్ సెంచరీ పూర్తయిందనుకున్న అయ్యర్.. సహచర ఆటగాడు రిషభ్ పంత్తో కలిసి సంబరాలు చేసుకున్నాడు. పంత్ కూడా అతనికి అభినందనలు తెలిపాడు. ఈ విషయాన్ని గమనించిన కెప్టెన్ విరాట్ కోహ్లీ.. హాఫ్ సెంచరీ ఇంకా కాలేదు అన్నట్టు సైగలు చేసి నవ్వుకున్నాడు. ఇక స్టేడియంలోని స్కోర్ బోర్డు మార్చే వారు కూడా కంగారుపడ్డారు. అనంతరం అయ్యర్ హాఫ్ సెంచరీ పూర్తిచేసాడు.
సోషల్ మీడియాలో వైరల్:
దీనికి సంబందించిన వీడియోను ఓ అభిమాని సోషల్ మీడియాలో పోస్ట్ చేసాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో తెగ వైరల్ అయింది. వీడియో చూసిన అభిమానులు నవ్వులు పూయిస్తున్నారు. మరోవైపు లైకులు, కామెంట్లు చేస్తున్నారు. విశాఖ వన్డేలో అయ్యర్ (32 బంతుల్లో 53; 3 ఫోర్లు, 4 సిక్సర్లు) పరుగుల వరద పారించిన విషయం తెలిసిందే.
20 ఏళ్ల రికార్డు బద్దలు:
పంత్, అయ్యర్లు పూనకం వచ్చిన వాళ్లలా విండీస్ బౌలర్లపై విరుచుకుపడ్డారు. షెల్డన్ కాట్రెల్ వేసిన 46వ ఓవర్లో పంత్ వరుసగా 6, 0, 4, 6, 4, 4తో మొత్తం 24 పరుగులు సాధించాడు. రోస్టన్ ఛేజ్ వేసిన 47వ ఓవర్లో అయ్యర్ 6, 6, 4, 6, 6 బాదడంతో మైదానం మోత మోగిపోయింది. ఈ ఓవర్లో మొత్తంగా 31 పరుగులు వచ్చాయి. వన్డేల్లో ఒక ఓవర్లో టీమిండియాకు ఇదే అత్యధిక స్కోరు (31). దీంతో 20 ఏళ్ల క్రితం సచిన్ టెండూల్కర్-అజయ్ జడేజా (28 పరుగులు) నెలకొల్పిన రికార్డు బద్దలయింది.