రెండేళ్ల క్రితం టీమిండియాతో పోల్చుకుంటే ప్రస్తుతం టీమిండియా చాలా బలహీనంగా కనపడుతోంది. ఆటగాళ్లంతా నైపుణ్యం ఉన్న వారే కానీ.. వాళ్ల ఫిట్నెస్ మాత్రం ప్రశ్నార్థకంగా మారింది. గాయం కారణంగా జస్ప్రీత్ బుమ్రా, రవీంద్ర జడేజా, దీపక్ చాహర్ వంటి ఆటగాళ్లు కొన్ని కీలక టోర్నమెంట్లలో ఆడలేకపోయారు. తాజాగా బంగ్లాదేశ్తో వన్డే సిరీస్కు యువ కీపర్ రిషభ్ పంత్ కూడా దూరమయ్యాడు.
ఇదంతా గమనించిన క్రికెట్ అభిమానులు.. ఆటగాళ్లు మరీ ఎక్కువ క్రికెట్ ఆడేస్తున్నారని అభిప్రాయపడుతున్నారు. అయితే ఇదంతా ఫిట్నెస్ లోపం వల్ల కావొచ్చని టీమిండియా ఐకన్ విరాట్ కోహ్లీ చిన్ననాటి కోచ్ రాజ్కుమార్ శర్మ అనుమానం వ్యక్తం చేశాడు. అసలు జట్టులో చేరే ఆటగాళ్లకు గతంలో చేసినట్లు 'యో-యో టెస్టులు చేస్తున్నారా?' అని ఆయన ప్రశ్నించారు. కోహ్లీ కెప్టెన్గా ఉన్నప్పుడు ఆటగాళ్లంతా ఈ టెస్టు కంపల్సరీగా తీసుకునే వాళ్లన్న విషయాన్ని కూడా ఆయన గుర్తుచేశాడు.
'టీమిండియా ఆటగాళ్లు యో యో టెస్టు క్లియర్ చేస్తున్నారో లేదో నాకు తెలీదు. కానీ విరాట్ కెప్టెన్గా ఉన్నప్పుడు ఇది కంపల్సరీగా ఉండేది. ఈ టెస్టులో కనీస స్కోరు సాధించలేని కారణంగా కొంత మంది ఆటగాళ్లు కొన్ని టోర్నీలు మిస్ అవడం కూడా మనం చూశాం. ఆటగాళ్ల ఫిట్నెస్ను కొలవడానికి ఇదొక మంచి విధానం. ఇదేం అంత కఠినమైన టెస్టు కూడా కాదు' అని రాజ్ కుమార్ శర్మ అన్నాడు.
అత్యున్నత స్థాయిలో క్రికెట్ ఆడాలనుకుంటూ.. ఇలాంటి సింపుల్ టెస్టు కూడా పాస్ అవలేకపోతే అంత కన్నా దురదృష్టకర పరిణామం మరొకటి ఉండదని కోహ్లీ చిన్ననాటి కోచ్ ఆవేదన వ్యక్తం చేశాడు. కెప్టెన్, కోచ్ ఇద్దరూ కలిసి ఆటగాళ్ల ఫిట్నెస్ కోసం కష్టపడాలని చెప్తే.. బీసీసీఐ కూడా ఒప్పుకొని తీరాలని ఆయన సూచించాడు. బీసీసీఐ కూడా ఆ దిశగా ఆలోచన చేయాలని ఆశిస్తున్నట్లు తెలిపాడు.