కోహ్లీ ఖాతాలో మరో మైలురాయి
ఇటీవల వెస్టిండిస్తో ముగిసిన ఐదు వన్డేల సిరిస్తో విరాట్ కోహ్లీ ఖాతాలో మరో మైలురాయి వచ్చి చేరింది. ఐదు వన్డేల సిరిస్లో వరుసగా మూడు సెంచరీలు సాధించడంతో కోహ్లీకి మ్యాన్ ఆఫ్ ద సిరిస్ అవార్డు లభించింది. దీంతో వన్డేల్లో ఏడు మ్యాన్ ఆఫ్ ద సిరిస్లను గెలుచుకుని టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ, వెటరన్ క్రికెటర్ యువరాజ్ సింగ్ల సరసరన సంయుక్తంగా నిలిచాడు.
గత రెండేళ్లలో పరుగుల వరద పారించిన కోహ్లీ
జనవరి, 2016 నుంచి విరాట్ కోహ్లీ అత్యధికంగా 7,824 పరుగులు సాధించాడు. కోహ్లీ సాధించిన 38 సెంచరీల్లో గత రెండేళ్లలోనే 28 సెంచరీలు సాధించడం విశేషం. ఈ సమయంలో అతడి సగటు 75.23గా ఉంది. ఇప్పటివరకు 216 వన్డేలాడిన కోహ్లీ 208 ఇన్నింగ్స్లలో 10,232 పరుగులు చేశాడు.
వన్డేల్లో కోహ్లీ అత్యధిక స్కోరు 183
వన్డేల్లో 38 సెంచరీలు, 48 హాఫ్ సెంచరీలు చేసిన కోహ్లీ అత్యధిక వ్యక్తిగత స్కోరు 183. మరోవైపు కోహ్లీ ఫామ్ గమనిస్తే ఏ రికార్డు కూడా భద్రంగా ఉండే పరిస్థితి లేదని మాజీ కెప్టెన్ గవాస్కర్ వ్యాఖ్యానించాడు. "కోహ్లీ ఫిట్నెస్ అమోఘం. మరో పదేళ్ల వరకు ఆడగల సత్తా ఉంది. అదే జరిగితే టెస్టులు, వన్డేల్లో అత్యధిక పరుగులు, సెంచరీలన్నీ అతడి ఖాతాలో చేరతాయి" అని గవాస్కర్ అన్నాడు.
టీ20ల్లో అత్యంత వేగంగా 2వేల పరుగుల చేసిన కోహ్లీ
ఇప్పటివరకు 73 టెస్టులాడిన విరాట్ కోహ్లీ 24 సెంచరీలు, 19 హాఫ్ సెంచరీల సాయంతో 6,331 పరుగులు సాధించాడు. టెస్టుల్లో కోహ్లీ అత్యధిక వ్యక్తిగత స్కోరు 243. ఇక, 62 టీ20లాడిన కోహ్లీ 2102 పరుగులు చేశాడు. అంతేకాదు టీ20ల్లో అత్యంత వేగంగా రెండు వేల పరుగుల మైలురాయిని అందుకున్న క్రికెటర్గా కోహ్లీ నిలిచాడు.