కెప్టెన్సీ వివాదాలు..
ఇలా ఫామ్ లేక తంటాలు పడుతున్న సమయంలోనే అనూహ్యంగా కోహ్లీ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. గతేడాది టీ20 ప్రపంచకప్ తర్వాత పొట్టి ఫార్మాట్లో కెప్టెన్సీకు వీడ్కోలు పలుకుతున్నట్లు ప్రకటించాడు. ఆ తర్వాత సడెన్గా బీసీసీఐ షాకింగ్ నిర్ణయం తీసుకుంది. వన్డేలకు కూడా అతన్ని కెప్టెన్గా తొలగించింది. ఈ గొడవ జరుతుండగానే భారత జట్టు సౌతాఫ్రికా పర్యటనకు వెళ్లింది. అక్కడ తొలి టెస్టులో అద్భుత విజయం సాధించింది. కానీ రెండో మ్యాచ్లో కోహ్లీ ఆడలేదు. ఆ మ్యాచ్ ఓటమి పాలైంది. మూడో మ్యాచ్లో కోహ్లీ ఉన్నా ఫలితం మారలేదు. దీంతో తొలిసారి సఫారీ గడ్డపై టెస్టు సిరీస్ గెలవాలన్న భారత అభిమానుల ఆశలు ఆవిరయ్యాయి. ఈ ఓటమి తర్వాత కోహ్లీ మరో షాకిచ్చాడు. టెస్టు కెప్టెన్సీకి కూడా వీడ్కోలు పలికాడు. వీటన్నింటి కన్నా ముందే ఐపీఎల్లో కూడా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుకు తాను కెప్టెన్సీ చేయబోనని ప్రకటించేశాడు.
వెంటాడిన వైఫల్యాలు..
అన్ని ఫార్మాట్లలో కెప్టెన్సీ వదులుకున్న తర్వాత కోహ్లీ మళ్లీ తన పూర్వ ఫామ్ అందుకుంటాడని, విమర్శకుల నోళ్లు మూయిస్తాడని అంతా అనుకున్నారు. కానీ ఆ ఆశ కూడా అభిమానులకు తీరలేదు. ఐపీఎల్లో మరో ఏడాది వైఫల్యమే అతన్ని వెంటాడింది. ఆ తర్వాత ఇంగ్లండ్ పర్యటనలో కూడా పూర్వంలా ఆడలేకపోయిన కోహ్లీ.. స్వల్ప స్కోర్లకే పెవిలియన్ చేరాడు. ఇలాంటి టైంలో సడెన్గా జట్టు నుంచి కోహ్లీని తప్పించేసింది టీం మేనేజ్మెంట్. విశ్రాంతి పేరుతో అతన్ని వెస్టిండీస్, జింబాబ్వే పర్యటనలకు పంపలేదు.
ఆసియా కప్లో ఫ్రెష్గా కనిపించిన కోహ్లీ
నెల రోజులపైగా పూర్తిగా విశ్రాంతి తీసుకున్న కోహ్లీ.. దాదాపు నెలరోజుల పాటు అసలు బ్యాటు పట్టలేదని, తన జీవితంలో ఇలా జరగడం ఇదే మొదటి సారని చెప్పాడు. అయితే ఈ విశ్రాంతి అతనిలో కొత్త జీవాన్ని నింపింది. ఈ విషయం ఆసియా కప్లో చాలా స్పష్టంగా కనిపించింది. ఆడిన తొలి మ్యాచ్లో ఫర్వాలేదనిపించిన అతను.. ఆ తర్వాత హాఫ్ సెంచరీతో ఆకట్టుకున్నాడు. చివర్లో ఆఫ్ఘనిస్తాన్పై భారీ సెంచరీతో తన సెంచరీ ఎదురు చూపులకు కూడా తెరదించాడు. దీంతో 'కింగ్ కోహ్లీ రిటర్న్స్' అంటూ అభిమానులు సంబరాలు చేసుకున్నారు.
ప్రపంచకప్లో వెన్నెముక
ఆసియా కప్లో కోహ్లీ రాణించినా కూడా భారత జట్టు ఆ టోర్నీ గెలవలేకపోయింది. గ్రూప్ దశలోనే నిష్క్ర్రమించింది. ఆ తర్వాత ఆస్ట్రేలియా, సౌతాఫ్రికాతో జరిగిన టీ20 సిరీసుల్లో కూడా కోహ్లీ ఫర్వాలేదనిపించాడు. అనంతరం ఆస్ట్రేలియా వేదికగా ప్రపంచకప్ మొదలైంది. ఇక్కడకు వచ్చాక ప్రాక్టీస్ మ్యాచుల్లో ఆడని కోహ్లీ.. ఆడిన ఏకైక వార్మప్ మ్యాచులో కూడా పెద్దగా ప్రభావం చూపలేదు. కానీ అభిమానులు అతనిపై నమ్మకం కోల్పోలేదు. ఈ నమ్మకాన్ని నిలబెట్టుకున్న కోహ్లీ తొలి మ్యాచ్లోనే తను ఎంత స్పెషల్ ప్లేయరో నిరూపించాడు. పాకిస్తాన్ చేతిలో ఓటమి తప్పదన్న స్థితి నుంచి ఒంటరిగా పోరాడి జట్టుకు ఒంటి చేత్తో విజయం అందించాడు. ఈ ఇన్నింగ్స్ చూసిన అభిమానులు కోహ్లీ మళ్లీ తన పూర్వ ఫామ్లోకి వచ్చేశాడని ఆనందం వ్యక్తం చేశారు.
సచిన్ రికార్డు బద్దలు
పాకిస్తాన్తో మ్యాచ్ తర్వాత కోహ్లీ వెనక్కు తిరిగి చూసుకోలేదు. నెదర్లాండ్స్పై కూడా హాఫ్ సెంచరీతో చెలరేగాడు. సౌతాఫ్రికాపై అనవసర షాట్కు ప్రయత్నించి పెవిలియన్ చేరాడు కానీ.. ఆ తర్వాత మళ్లీ తనేంటో నిరూపించుకున్నాడు. బంగ్లాదేశ్తో జరిగిన మ్యాచ్లో అద్భుతంగా ఆడాడు. ఈ మ్యాచ్లో కూడా హాఫ్ సెంచరీ నమోదు చేశాడు. ఇలా ప్రపంచకప్లో పరుగుల వరద పారిస్తున్న కింగ్ కోహ్లీ.. ఈ క్రమంలో మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ పేరిట ఉన్న మరో రికార్డును బద్దలు కొట్టాడు. విదేశీ గడ్డపై అత్యధిక పరుగులు చేసిన భారత బ్యాటర్ల జాబితాలో సచిన్ను దాటేశాడు. వీళ్లిద్దరూ కూడా భారత్ తర్వాత భారీగా పరుగులు చేసింది ఆస్ట్రేలియా గడ్డపైనే కావడం గమనార్హం. ఆస్ట్రేలియాలో సచిన్ టెండూల్కర్ అత్యధికంగా 3300 పరుగులు చేశాడు. బంగ్లా మ్యాచ్లో హాఫ్ సెంచరీతో 3350 చేసిన కోహ్లీ.. ఈ రికార్డును అధిగమించాడు.