
హైదరాబాద్: కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్లో భారత్-శ్రీలంక జట్ల మధ్య జరిగిన తొలి టెస్టు డ్రాగా ముగిసిన సంగతి తెలిసిందే. చివరిరోజైన సోమవారం ఉత్కంఠభరితంగా సాగిన ఈ టెస్టులో కోహ్లీసేన విజయం అంచువరకు వచ్చినా... వెలుతురులేమి కారణంగా శ్రీలంక బతికిపోయింది.
అయితే తాజాగా ఈ టెస్టుపై కొత్తవాదన తెరపైకి వచ్చింది. విరాట్ కోహ్లీ సెంచరీ కోసం చూసుకోకుండా ఇంకాస్త ముందుగా భారత్ తన రెండో ఇన్నింగ్స్ను డిక్లేర్ చేసి ఉంటే ఫలితం మరోలా ఉండేదని క్రికెట్ విశ్లేషకులు అంటున్నారు. ఈ నేపథ్యంలో బీసీసీఐ విడుదల చేసిన ఓ వీడియో ఆసక్తిని కలిగిస్తోంది.
నిజానికి విరాట్ కోహ్లీ 97 పరుగుల వద్ద ఉన్నప్పుడు ఇన్నింగ్స్ను డిక్లేర్ చేస్తానని ప్రధాన కోచ్ రవిశాస్త్రి చెప్పినట్లు ఆ వీడియోలో ఉంది. అయితే రవిశాస్త్రి మరో ఓవర్ ఆడి సెంచరీ సాధించిన తర్వాత డిక్లేర్ చేయాల్సిందిగా కోహ్లీకి సూచించాడు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయింది.
ఆ వీడియో మీకోసం:
డ్రస్సెంగ్ రూమ్ నుంచి మేసేజ్ అందుకున్న విరాట్ కోహ్లీ సిక్స్ బాది టెస్టుల్లో 18వ సెంచరీని నమోదు చేసిన సంగతి తెలిసిందే. అంతేకాదు ఈడెన్లో విరాట్ కోహ్లీకి ఇది తొలి టెస్టు సెంచరీ కావడం విశేషం. ఈ సెంచరీతో సచిన్ తర్వాత భారత్ తరుపున అత్యధిక సెంచరీలు సాధించిన ఆటగాడిగా కోహ్లీ రికార్డు సృష్టించాడు.
ఇక, మొత్తంగా చూస్తే అత్యధిక సెంచరీలు నమోదు చేసిన జాబితాలో సచిన్ టెండూల్కర్ (100) తొలిస్థానంలో ఉండగా.. రికీ పాంటింగ్ (71) కుమార సంగక్కర (63), జాక్వస్ కల్లీస్ (62), మహిళా జయవర్ధనే (54), హషీమ్ ఆమ్లా (54) బ్రియాన్ లారా (53)ల తర్వాత విరాట్ కోహ్లీ (50) 8వ స్థానంలో నిలిచాడు.
మ్యాచ్ అనంతరం రవిశాస్త్రి... కోహ్లీపై ప్రశంసల వర్షం కురిపించాడు. 'కోహ్లీకి ఇక ఆకాశమే హద్దు, అతనో అద్భుతమైన ఆటగాడు. సచిన్ రికార్డు బ్రేక్ చేయడానికి సగం దూరం వచ్చాడు. కోహ్లీ ఈ రికార్డు సాధించడం చాలా సంతోషంగా ఉంది.' అని లంకతో తొలి టెస్టు డ్రా అనంతరం ఓ ప్రమోషన్ ఈవేంట్లో రవిశాస్త్రి కోహ్లిని కొనియాడాడు.
తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్లో ఫాలో అవ్వండి.