వన్డే కెప్టెన్సీ సైతం..
టీ20 ప్రపంచకప్ గెలుపుపైనే అతని వన్డే కెప్టెన్సీ భవితవ్యం కూడా ఆధారపడి ఉందని సదరు అధికారి తెలిపాడు. 'పరిమిత ఓవర్ల సారథ్యం నుంచి తనను తప్పిస్తారనే విషయం విరాట్ కోహ్లీకి తెలుసు. యూఏఈ వేదికగా టీ20 ప్రపంచకప్లో టీమ్ ప్రదర్శన ఆధారంగానే అతని కెప్టెన్సీ భవితవ్యం ఆధారపడి ఉంది. మెగా టోర్నీలో టీమిండియా విఫలమైతే కోహ్లీ టెస్ట్ కెప్టెన్సీకే పరిమితం కానున్నాడు. ఆ క్రమంలోనే తనపై కొంత ఒత్తిడిని తగ్గించుకునేందుకు కోహ్లీనే ముందుగా ప్రకటన చేశాడు.
షాకింగ్ ప్రపోజల్..
మెగాటోర్నీకి భారత జట్టు ఎంపిక సమయంలో సెలెక్షన్ కమిటీ ముందు కోహ్లీ ఓ షాకింగ్ ప్రతిపాదన చేశాడు. పరిమిత ఓవర్ల వైస్ కెప్టెన్సీ బాధ్యతల నుంచి రోహిత్ శర్మను తప్పించాలని కోరాడు. 34 ఏళ్ల రోహిత్ శర్మను తప్పించి యువ ఆటగాళ్లకు అవకాశం ఇవ్వాలన్నాడు. భారత క్రికెట్ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని ఈ నిర్ణయం తీసుకోవాలన్నాడు. వన్డే వైస్ కెప్టెన్గా కేఎల్ రాహుల్, టీ20 వైస్ కెప్టెన్గా రిషభ్ పంత్ను నియమించాలన్నాడు. అయితే ఈ ప్రతిపాదనను బోర్డు పెద్దగా పట్టించుకోలేదు. పైగా కోహ్లీ నిజమైన వారుసుడిని కోరుకోవడం లేదనే అభిప్రాయనికి వచ్చింది.'అని సదరు అధికారి పేర్కొన్నాడు.
లీక్స్ నిజమే..
కోహ్లీ వన్డే, టీ20 పగ్గాలు వదిలేస్తున్నాడట.. రోహిత్ శర్మ పరిమిత ఓవర్ల సారథ్య బాధ్యతలు చేపట్టనున్నాడట! అని గత సోమవారం జోరుగా ప్రచారం సాగింది. కానీ ఈ వదంతుల్ని బీసీసీఐ కొట్టి పారేసింది. మూడు ఫార్మాట్లలో సారథిగా కోహ్లీనే కొనసాగుతాడని, అసలు భారత క్రికెట్లో వేర్వేరు కెప్టెన్ల పద్ధతి పని చేయదని స్పష్టం చేసింది.
కానీ రెండు రోజుల తిరిగేసరికి.. తాను టీ20 పగ్గాలు వదిలేస్తున్నట్లు ప్రకటించి కోహ్లీ ఆశ్చర్యానికి గురి చేయగా.. గత ఆరు నెలలుగా దీనిపై తాము చర్చిస్తున్నామని బీసీసీఐ సెక్రటరీ జైషా వెల్లడించడం సందేహాలకు దారితీస్తుంది. పైగా బోర్డు నుంచి వస్తున్న లీకులన్నీ నిజమవుతున్నాయి. అసలు భారత జట్టులో అంతర్గతంగా ఏం జరుగుతుందనే అనుమానం కలుగుతోంది.
రోహితా? రాహులా?...
కోహ్లీ ప్రకటనతో ఇప్పుడిక టీ20ల్లో అతని వారసుడు ఎవరనే చర్చ జోరుగా సాగుతోంది. ఐపీఎల్లో ముంబైని అయిదుసార్లు విజేతగా నిలపడమే పేరు తెచ్చుకోవడమే కాక.. కోహ్లీ అందుబాటులో లేనపుడు భారత జట్టును చక్కగా నడిపించిన రోహిత్ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. కానీ కోహ్లీ కంటే రెండేళ్లు పెద్దవాడు, ఇంకో మూణ్నాలుగేళ్లలో రిటైరయ్యే అవకాశమున్న 34 ఏళ్ల రోహిత్కు కుర్రాళ్ల ఆటైన టీ20 ఫార్మాట్లో కెప్టెన్సీ అప్పగించడం సరైందేనా? అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకుని రాహుల్, శ్రేయస్, పంత్ లాంటి యువ ఆటగాళ్లకు అవకాశం ఇవ్వాలన్న అభిప్రాయాలూ వ్యక్తమవుతున్నాయి. మరి బీసీసీఐ ఏం చేస్తుందో చూడాలి.