ముంబై: మహమ్మారి కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు కేంద్రం విధించిన లాక్డౌన్ సమయంలో ఎవరైనా గృహహింసకు పాల్పడితే.. వెంటనే ఫిర్యాదు చేయాలంటూ టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ, అతని సతీమణి 'బాలీవుడ్ హీరోయిన్' అనుష్క శర్మలు అభిమానులకు వీడియో సందేశం ఇచ్చారు. కరోనా కారణంగా లాక్డౌన్ విధించిన నేపథ్యంలో గృహహింస పెరుగుతున్న తీరు ఆందోళన కల్గిస్తుంది. దాదాపు నెల నుంచి లాక్డౌన్ కొనసాగుతున్న ఫలితంగా కుటుంబ సభ్యులంతా కలిసి ఇళ్లల్లో ఉండాల్సి వస్తోంది. ఇది వారి మధ్య పరస్పర అవగాహన పెంచి, మానవ సంబంధాల్ని కొంతవరకూ మెరుగు పరుస్తున్నా.. గృహహింస కూడా అధికమైపోయింది.
సచిన్, కోహ్లీ, రోహిత్ కాదు.. చిత్రాంగదా సింగ్కు ఇష్టమైన టీమిండియా క్రికెటర్ ఎవరో తెలుసా?!!
మార్చి 22వ తేదీ నుంచి ఏప్రిల్ 16వ తేదీ వరకూ గృహహింసకు గురవుతున్నామని 239 ఫిర్యాదులు అందాయని జాతీయ మహిళ కమిషన్ (ఎన్సీడబ్ల్యూ) వెల్లడించింది. మహిళలను కాపాడేందుకు 50కి పైగా హెల్ప్లైన్లు ఏర్పాటు చేసినట్టు ఎన్సీడబ్యూ చైర్పర్సన్ రేఖా శర్మ పేర్కొన్నారు. లాక్డౌన్ సమయంలో గృహహింసకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.
గృహహింసను ఎవరైనా ఎదుర్కొంటే వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయాలని బాధితులకు ప్రముఖ క్రికెటర్లు, బాలీవుడ్ స్టార్స్ సూచించారు. ఈ మేరకు ఓ వీడియోను రూపొందించి విరాట్ కోహ్లీ తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేశాడు. 'మీరు గృహహింస బాధితురాలు అయితే వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయండి. మీ చుట్టుపక్కన వారిపై గృహహింస జరుగుతుందని మీకు తెలిసినా చెప్పండి. అందరం కలిసి గృహహింసపై లాక్డౌన్ను విధించుదాం' అని వీడియోకి వ్యాఖ్య జత చేశాడు. వీడియోలో కోహ్లీ సతీమణి అనుష్క శర్మ, వైస్ కెప్టెన్ రోహిత్ శర్మ, భారత మహిళల జట్టు సారథి మిథాలీ రాజ్.. బాలీవుడ్ ప్రముఖులు ఫర్హన్ అక్తర్, కరణ్ జోహర్, మాధురి దీక్షిత్ ఉన్నారు.
లాక్డౌన్ సమయంలో గృహహింస కేసులు పెరగడంపై ఇదివరకే భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా ఆగ్రహం వ్యక్తం చేసింది. 'మనమందరం ఐక్యంగా ఉండాలి. పురుషులు, మహిళలను సమానం గౌరవంతో చూడాలి. గృహహింస కేసులు పెరిగాయన్న నివేదికలను చూశా. ఇవి అమానుష చర్యలు. గృహహింసను నేను ఎప్పుడూ తీవ్రంగా ఖండిస్తా. అన్ని సమయాలలో మహిళలను తమతో సమానంగా పురుషులు గౌరవించాలి. ఎంతో మర్యాదగా ప్రవర్తించాలి. గౌరవం కోసం డిమాండ్ చేయాల్సిన బాధ్యత మహిళలపై ఉంది' అని సానియా పేర్కొంది.