
ముంబై: టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ, అతని సతీమణి అనుష్క శర్మ మరోసారి తమ గొప్ప మనసును చాటుకున్నారు. కరోనా బాధితులకు సాయంగా రూ.2 కోట్ల విరాళాన్ని ప్రకటించారు. అంతేకాకుండా కరోనా కట్టడి కోసం ఫండ్ రైజింగ్కు పిలుపునిచ్చారు. కెట్టో సంస్థతో కలిసి #InThisTogether అనే ఫండ్ రైజింగ్ క్యాంపైన్కు శ్రీకారం చుట్టారు. ఈ మేరకు కోహ్లీ, అనుష్క శర్మ తమ సోషల్ మీడియా వేదికగా ఓ వీడియోను విడుదల చేశారు.
'దేశంలో పరిస్థితులు చాలా దారుణంగా మారుతున్నాయి. కరోనా నుంచి కోలుకోవడానికి దేశం పోరాడుతోంది. జనాలు ఇలా ఇబ్బంది పడుతుంటే చూడడానికి చాలా కష్టంగా ఉంది. మన కోసం రేయింబవళ్లు కష్టపడుతున్న మెడికల్, ఫ్రంట్లైన్ సిబ్బందికి ఏం చెప్పినా సరిపోదు. వారికి ఇప్పుడు మన మద్దుత అవసరం. అందుకే అనుష్క శర్మ, నేను.. కెట్టోతో కలిసి ఈ ఫండ్ రైజింగ్ క్యాంపైన్ మొదలుపెడుతున్నాం. ప్రతీ రూపాయి ఎంతో ఉపయోగడపడుతుంది. మనం కుటుంబం కోసం, స్నేహితుల కోసం కలిసి నడుద్దాం. కరోనాను జయిద్దాం'అని ఆ వీడియో ద్వారా విరుష్కా జోడీ పిలుపునిచ్చారు.
అయితే ఈ పోస్ట్లో ఎక్కడా తాము ఎంత విరాళం ఇచ్చామనే విషయాన్ని ప్రస్తావించలేదు. కానీ కెట్టో సంస్థ టాప్ డోనర్స్ జాబితాలో విరాట్ కోహ్లీ, అనుష్క శర్మ రూ.2 కోట్ల విరాళం ఇచ్చినట్లుగా పేర్కొంది. గతేడాది కూడా ఈ జోడీ పీఎం కేర్స్కు భారీ విరాళాన్ని అందజేసింది. అప్పుడు కూడా ఎంత చేశామనే విషయంలో గోప్యత పాటించింది. కానీ వారి సన్నిహితుల సమాచారం ప్రకారం విరాట్, అనుష్క రూ.3 కోట్లు విరాళాన్ని అందేసినట్లు తెలిసింది.
ఐపీఎల్ 2021 సీజన్ వాయిదా పడటంతో ముంబైకి వచ్చిన విరాట్.. కరోనా బాధితుల సాయార్దం ఈ ఫండ్ రైజింగ్ క్యాంపయిన్ను మొదలుపెట్టాడు. జూన్లో జరిగే వరల్డ్ టెస్ట్ చాంపియన్ షిప్ ఫైనల్ కోసం ఈ నెల ఆఖర్లో ఇంగ్లండ్ వెళ్లనున్నాడు.