న్యూఢిల్లీ: ఎడ్జ్బాస్టన్ వేదికగా ఇంగ్లాండ్తో జరిగిన తొలి టెస్టు రెండో రోజు కోహ్లీ తానొక్కడై జట్టును నడిపించాడు. 225 బంతులు ఆడి 149 పరుగులు చేశాడు. దీంతో అభిమానులతో పాటుగా సీనియర్లు కూడా అతనిపై ప్రశంసలు కురిపించారు. ఈ ప్రదర్శనపై వెస్టిండీస్ విధ్వంసకర బ్యాట్స్మన్ క్రిస్ గేల్ అతని ఐపీఎల్ సహచరుడైన విరాట్ కోహ్లీని పొగిడేస్తున్నాడు.
టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ సెంచరీ.. తన జట్టు సహచరులకు స్ఫూర్తినిచ్చేలా ఉందని వెస్టిండీస్ హిట్టర్ క్రిస్ గేల్ అన్నాడు. ఇంగ్లాండ్ పిచ్లపై బ్యాటింగ్ చేసేందుకు ఇబ్బందిపడుతున్న టీమిండియా లైనప్కు ఇది మార్గదర్శకంగా నిలుస్తుందన్నాడు. ముంబైలో షూటింగ్తో బిజీగా ఉన్నా. కేవలం హైలెట్స్ మాత్రమే చూశా. విరాట్ నుంచి వచ్చిన కెప్టెన్ ఇన్నింగ్స్ ఇది. లోయర్ ఆర్డర్తో కలిసి అతను ఇన్నింగ్స్ను చక్కదిద్దిన విధానం సూపర్బ్.
సిరీస్లో అదిరిపోయే ఆరంభం దక్కింది. ఇంగ్లాండ్పై సిరీస్ గెలిచే సత్తా విరాట్సేనకు ఉంది. వాళ్లు కూడా మనుషులే. ఎవర్ని తక్కువగా అంచనా వేయలేం అని సిక్సర్ల వీరుడు పేర్కొన్నాడు. రూట్ 80 పరుగులకు, విరాట్ సెంచరీకి మధ్య పోలిక గురించి ఆడగ్గా.. ఇంగ్లాండ్ కెప్టెన్ ఇన్నింగ్స్ను కూడా తాను చూడలేదని తెలివిగా తప్పించుకున్నాడు. కేవలం రనౌట్, మైక్ డ్రాప్ సంబరాలను మాత్రమే చూశానని చెప్పాడు.
2019 వన్డే ప్రపంచకప్లో ఆడే అంశంపై గేల్ స్పందించాడు. ఈ మెగా ఈవెంట్లో ఆడే సత్తా తనకు ఉందని ధీమా వ్యక్తం చేశాడు. కోచ్లు, సెలెక్టర్లతో కూర్చోని వాళ్ల ప్రణాళికలేంటో తెలుసుకోవాలి. నాకైతే నమ్మకం ఉంది. 2020 ఆసీస్లో జరిగే టీ20 వరల్డ్కప్ వరకు జట్టులో ఉంటానని అనుకుంటున్నా. విండీస్ జట్టులో హెట్మెయర్ షాయ్ హోప్, లూయిస్ భవిష్యత్ స్టార్లు అని ఈ కరీబియన్ వెల్లడించాడు. వచ్చే ప్రపంచకప్లో డివిలియర్స్ లేకపోతే ఏంటీ.. తాను ఉన్నా కదా అంటూ మరో ప్రశ్నకు జవాబిచ్చాడు. ఇదిలా ఉంటే బంగ్లాదేశ్ పర్యటనకు వెస్టిండీస్ క్రికెట్ బోర్డు గేల్ను పక్కకు పెట్టేసిన సంగతి తెలిసిందే.