ఆ ఆలోచనే లేదు..
'భారత జట్టులో అవకాశం వస్తుందా? లేదా? అనేది ఏ మాత్రం ఆలోచించడం లేదు. ఎందుకంటే అది నా చేతుల్లో లేదు. బాగా హార్డ్ వర్క్ చేసి నేను ఆడే మ్యాచ్ల్లో రాణించడమే నా ముందున్న కర్తవ్యం. కాకపోతే భారత జట్టులో చోటు కోసం నా సాయశక్తులా ప్రయత్నిస్తాను. ఏ ఆటగాడికైనా దేశం తరఫున ఆడటాన్ని గౌరవంగా భావిస్తాడు. ఇందులో ఎలాంటి సందేహం లేదు. అయితే నేను బాగా రాణించినప్పుడు కూడా అవకాశం దక్కకపోతే బాధగా ఉంటుంది.
గాయాలు దెబ్బతీసాయి..
నిజాయితీగా చెప్పాలంటే ప్రస్తుత పరిస్థితుల్లో భారత జట్టులో చోటు దక్కడం కష్టమే. టీమిండియాకు అరంగేట్రం చేసే సమయంలోను గాయాలు నన్ను ఇబ్బంది పెట్టాయి. ఒక సిరీస్లో మంచిగా ఆడుతున్న దశలోనే ఏదో ఒక గాయంతో జట్టుకు దూరమయ్యాను. టీమిండియాకు ఆడిన అన్ని సందర్భాల్లో మంచి ప్రదర్శనే నమోదు చేశా. కానీ విధి నాతో ఆడుకుంది. కెరీర్ మొత్తంలో నాకు గాయాలే ఎక్కువగా కనిపించాయి. మ్యాచ్లో బరిలోకి దిగిన ప్రతీసారి నా సాయశక్తుల ఆడే ప్రయత్నం చేస్తున్నా. ఇప్పటికీ నాకు అవకాశాలు మిగిలే ఉన్నాయి. నా ప్రయత్నం నేను చేస్తా.. కానీ ఎంపిక అనేది నా చేతుల్లో లేదు'అని చెప్పుకొచ్చాడు.
జిడ్డు బ్యాటింగ్తో..
వాస్తవానికి 2016లోనే విజయ్ శంకర్ టీమిండియాలోకి అరంగేట్రం చేయాల్సింది. కానీ హార్దిక్ పాండ్యా రూపంలో అతనికి అవకాశం చేజారింది. ఆ తర్వాత మళ్లీ టీమిండియా తలుపు తట్టేందుకు రెండేళ్లు ఎదురుచూడాల్సి వచ్చింది. 2018లో నిదహాస్ ట్రోపీలో భాగంగా శ్రీలంకతో జరిగిన మ్యాచ్ ద్వారా అంతర్జాతీయ క్రికెట్లోకి అడుగుపెట్టాడు. ఆ ట్రోపీలో ఒక మ్యాచ్లో రెండు కీలక వికెట్లు తీయడం ద్వారా మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్గా నిలిచాడు. కానీ కీలక ఫైనల్ మ్యాచ్లో ఒత్తిడిని అధిగమించలేక బాల్స్ను వృథా చేస్తూ సాగిన అతని జిడ్డూ బ్యాటింగ్ అభిమానులు ఎప్పటికీ మరిచిపోలేరు. ఆ మ్యాచ్లో కార్తీక్ చివరి బంతికి సిక్స్ కొట్టడంతో భారత్ గెలిచింది.
త్రీడీ ఆటగాడంటూ..
ఆ తర్వాత 2019 ఆస్ట్రేలియా పర్యటనలో హార్దిక్ పాండ్యా గైర్హాజరీలో అవకాశం అందుకున్న విజయ్ శంకర్.. వన్డేల్లోనూ అరంగేట్రం చేశాడు. ఆ తర్వాత త్రీడీ ఆటగాడంటూ వన్డే ప్రపంచకప్కు ఎంపికయ్యాడు. 2019 ప్రపంచకప్ సెలక్షన్ సందర్భంగా నాటి చీఫ్ సెలెక్టర్ ఎమ్మెస్కే ప్రసాద్ చేసిన వ్యాఖ్యలు అతని కెరీర్ను దెబ్బతీసాయని చెప్పవచ్చు. బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ ఇలా అన్ని విభాగాల్లో విజయ్ శంకర్.. రాయుడు కన్నా మెరుగ్గా ఉన్నాడని, అతను మల్టీ డైమన్షన్ ప్లేయర్ అంటూ ఎమ్మేస్కే ప్రసాద్ మీడియా ముందు మాట్లాడాడు. కానీ విజయ్ శంకర్ ఆ ప్రపంచకప్లో ఘోరంగా విఫలమయ్యాడు. గాయంతో మధ్యలోనే ఇంటిదారి పట్టాడు. అప్పటి నుంచి మళ్లీ అతను టీమిండియాలో చోటు దక్కించుకోలేదు. ఐపీఎల్ 2021 సీజన్లోనూ విజయ్ శంకర్ దారుణంగా విఫలయ్యాడు.