ఇన్నింగ్స్ 13వ ఓవర్లో
టాస్ ఓడి తొలుత బ్యాటింగ్కు దిగిన న్యూజిలాండ్ ఇన్నింగ్స్ 13వ ఓవర్లో భారత ఆటగాళ్ల తప్పిదాలతో మొత్తం ఈ ఓవర్లో 17 పరుగులు వచ్చాయి. హార్దిక్ పాండ్యా వేసిన ఆ ఓవర్లో తొలి బంతిని మున్రో భారీ షాట్ ఆడగా.. ఖలీల్ సులువైన క్యాచ్ను చేజార్చాడు. మూడో బంతిని మళ్లీ మున్రో షాట్ ఆడగా శంకర్ మిస్ ఫీల్డ్తో బంతి బౌండరీకి వెళ్లింది.
భారీ సిక్సర్ బాదిన మున్రో
ఆ మరుసటి బంతినే మున్రో భారీ సిక్సర్గా మలిచాడు. ఆ వెంటనే మున్రో మరో క్యాచ్ ఇవ్వగా.. థర్డ్ మ్యాన్గా ఉన్న కుల్దీప్ అందుకోలేకపోయాడు. దీంతో తీవ్ర అసహనానికి గురైన హార్దిక్ నెత్తిని బాదుకున్నాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ముఖ్యంగా భారత బౌలర్లలో భువనేశ్వర్ కుమార్ (1/37), ఖలీల్ అహ్మద్ (1/47) నిరాశపరిచారు.
పొదుపుగా బౌలింగ్ చేసిన కుల్దీప్
చాహల్ స్థానంలో తుది జట్టులోకి వచ్చిన కుల్దీప్ యాదవ్ (2/26) పొదుపుగా బౌలింగ్ చేయడంతో పాటు రెండు వికెట్లు తీశాడు. మూడో టీ20లో టీమిండియా పోరాడి ఓడిపోయింది. 213 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా 6 వికెట్ల నష్టానికి 208 పరుగులు చేసింది. దీంతో మూడో టీ20లో భారత క్రికెట్ జట్టు 4 పరుగుల తేడాతో ఓటమి పాలైంది.
కివీస్ గడ్డపై భారత్ ఆశలు తీరలేదు
దాంతో న్యూజిలాండ్లో తొలిసారి టీ20 సిరీస్ సాధించాలనుకున్న భారత్ ఆశలు తీరలేదు. మూడు టీ20ల సిరిస్ను న్యూజిలాండ్ 2-1తో కైవసం చేసుకుంది. ఆఖరి ఓవర్లో భారత్ విజయానికి 16 పరుగులు అవసరంకాగా.. దినేశ్ కార్తీక్ (33 నాటౌట్), కృనాల్ పాండ్య (26 నాటౌట్) దూకుడుగా ఆడి మ్యాచ్ని గెలిపించే ప్రయత్నం చేశారు.
ఆఖరి ఓవర్లో 11 పరుగులిచ్చిన సౌథీ
కానీ తెలివిగా బౌలింగ్ చేసిన ఫాస్ట్ బౌలర్ టిమ్ సౌథీ 2, 0, 0, 1, 1, Wd, 6 రూపంలో కేవలం 11 పరుగులే ఇచ్చి న్యూజిలాండ్ విజయంలో కీలకపాత్ర పోషించాడు. ఆ ఓవర్లో తొలి బంతికి డబుల్ తీసిన కార్తీక్.. ఆ తర్వాత వరుసగా రెండు బంతుల్ని వృథా చేసి.. నాలుగో బంతికి సింగిల్ తీశాడు. ఇక ఐదో బంతికి మళ్లీ కృనాల్ సింగిల్ తీసివ్వగా.. ఆ తర్వాత వైడ్.. ఆఖరి బంతిని కార్తీక్ సిక్స్గా మలిచాడు. దీంతో ఈ మ్యాచ్లో భారత్ 4 పరుగుల తేడాతో ఓడింది.