మాటల యుద్ధం:
తాజాగా భారత వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్తో ఓ ఆన్లైన్ కార్యక్రమంలో మాట్లాడిన మాజీ పేసర్ వెంకటేశ్ ప్రసాద్.. పాకిస్థాన్ మాజీ సారథి ఆమిర్ సోహేల్తో జరిగిన వివాదాస్పద స్లెడ్జింగ్ గురించి వివరించాడు. 1996 ప్రపంచకప్లో బెంగళూరులో పాకిస్థాన్తో జరిగిన క్వార్టర్ ఫైనల్ మ్యాచ్లో తమ ఇద్దరి మధ్య మాటల యుద్ధం జరిగిందని, సోహేల్ తన బౌలింగ్లో బౌండరీ కొట్టిన మరుసటి బంతికే అతడిని ఔట్ చేశానని చెప్పాడు. పాకిస్థాన్ బ్యాట్స్మెన్ ఎవరైనా భారత బౌలర్లపై చెలరేగడం తనకు నచ్చదని, ఆ సమయంలో తాను ప్రశాంతంగా ఉండడం చాలా కష్టమని వెంకీ చెప్పాడు.
చేతి వేళ్లతో సైగలు చేశాడు:
'అది 1996 ప్రపంచకప్.. బెంగళూరులో పాకిస్థాన్తో క్వార్టర్ ఫైనల్ మ్యాచ్. 15వ ఓవర్లో నేను బౌలింగ్ చేస్తుండగా.. ఆమిర్ సోహేల్ ఎక్స్ట్రా కవర్ దిశగా ఓ బౌండరీ బాదాడు. నేనా షాట్ను అస్సలు ఊహించలేదు. ఎంతో కీలక మ్యాచ్ కావడంతో ఈ పోరును ప్రపంచం మొత్తం ఆసక్తిగా తిలకిస్తోంది. ఆమిర్ ఫోర్ కొట్టాక బ్యాట్ను బౌండరీ వైపు చూపించి చేతి వేళ్లతో సైగలు చేశాడు. తర్వాతి బంతికి ఇంకో ఫోర్ కొడతానని, మళ్లీ వెళ్లి తెచ్చుకో అన్నట్టు ఎగతాళి చేశాడు. దాంతో ఇద్దరి మధ్య మాటలు పెరిగాయి. అప్పుడు నా మదిలో ఎన్నో ఆలోచనలు మొదలయ్యాయి' అని వెంకటేశ్ ప్రసాద్ తెలిపాడు.
ఆధిపత్యం చెలాయిస్తే నచ్చదు:
'నా మీద ఏ బ్యాట్స్మన్ ఆధిపత్యం చెలాయించినా నాకు నచ్చదు. నా మనస్తత్వం అలాంటిది. ఎవరైనా అలా చేస్తే వెంటనే వారికి తిరిగివ్వాలనుకునేవాడిని. అప్పుడే ఆమిర్ను ఔట్ చేయాలని నిర్ణయించుకున్నా. దాంతో బ్యాట్స్మన్కు బంతి అందకుండా వికెట్ టు వికెట్ వేయాలనుకున్నా. నా కోపాన్ని అదుపులో ఉంచుకొని అలాగే చేశా. తర్వాతి బంతికే సోహేల్ బౌల్డయ్యాడు' అని మాజీ పేసర్ వివరించాడు. వికెట్ పడగానే ఒక్కసారిగా పట్టరాని ఆవేశంతో వెంకటేశ్ ప్రసాద్ 'బాస్టర్డ్... గో హోమ్' అంటూ పెవిలియన్ వైపు దారి చూపించాడు. వెంకటేశ్ భారత్ తరఫున 33 టెస్టులు, 161 వన్డే మ్యాచ్లు ఆడాడు.
39 పరుగుల తేడాతో ఓటమి:
ఆ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్.. పాకిస్థాన్ ముందు 288 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది. నవ్జోత్ సింగ్ సిద్ధూ (93) ఆకట్టుకున్నాడు. లక్ష్య ఛేదనలో పాక్ ధాటిగా ఆరంభించిడంతో ఆ జట్టు తేలిగ్గా గెలిచేలా అనిపించింది. ముఖ్యంగా ఓపెనర్ ఆమిర్ సోహేల్ (55) ధాటిగా ఆడాడు. అతడు 15వ ఓవర్లో ఔటయ్యాక పాక్ క్రమంగా వికెట్లు కోల్పోయింది. సోహేల్ ఔటవ్వడంతోనే మ్యాచ్ మలుపు తిరిగింది. చివరికి పాక్ 9 వికెట్ల నష్టానికి 248 రన్స్ చేసి 39 పరుగుల తేడాతో ఓటమిపాలైంది.