బంతి కోసం వెతికిన ఫెర్గూసన్:
ఈ మ్యాచ్లో ఆసీస్ బ్యాటింగ్ చేస్తోంది. కివీస్ స్పిన్నర్ ఇష్ సోధి వేసిన 19వ ఓవర్లో ఆసీస్ కెప్టెన్ ఆరోన్ ఫించ్ భారీ సిక్సర్ బాదాడు. బంతి కాస్త స్టాండ్స్లోకి వెళ్ళిపడింది. స్టేడియంలో ప్రేక్షకులు లేకపోవడంతో బంతి కోసం కివీస్ ఫీల్డర్ లాకీ ఫెర్గూసన్ స్టాండ్స్లోకి వెళ్ళాడు. అక్కడ బంతి కనబడకపోవడంతో ఫెర్గూసన్ తీవ్రంగా వెతికాడు. చాలాసేపు శ్రమించిన తర్వాత అతడికి బంతి దొరికింది.
|
ఆస్టన్ అగర్ కూడా:
ఇక న్యూజిలాండ్ ఇన్నింగ్స్లోనూ ఇదే పరిస్థితి ఎదురైంది. జిమ్మీ నీషమ్ సిక్సర్ బాదగా.. సబ్స్టిట్యూట్ ఫీల్టర్ ఆస్టన్ అగర్ బంతికి కోసం ఎంతోసేపు వెతికాడు. చివరకు బంతి దొరకడంతో మైదానంలోకి వచ్చాడు. ఈ రెండు ఘటనలతో స్టేడియంలో ప్రేక్షకులు లేకపోతే ఎంత కష్టమో ఆసీస్, కివీస్ ఆటగాళ్లకు తెలిసింది. మరోవైపు ఆటగాళ్లు సిక్సర్ బాదినా.. ఎంకరేజ్ చేసేందుకు కూడా ఎవరూ లేరు. ప్రేక్షకులు లేకుండా స్టేడియాలు బోసిపోతున్నాయి.
ప్రేక్షకుల విలువ తెలిసి వచ్చిందా:
ఈ రెండు ఘటనలకు సంబంధించిన వీడియోలను క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ) ట్వీట్ చేసింది. దీనిపై నెటిజన్లు సరదాగా స్పందిస్తున్నారు. 'ప్రేక్షకుల విలువ ఇప్పుడు తెలిసి వచ్చిందా' అని కొందరు అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. మరికొందరు బంతి కోసం స్టాండ్స్లో మైదాన సిబ్బందిని ఉంచాలని కామెంట్లు పెడుతున్నారు. అయ్యో పాపం బంతికోసం ఆటగాళ్లు ఎంత పడుతున్నారు, ప్రేక్షకులు లేకుండా స్టేడియాలు బోసిపోతున్నాయి అని కామెంట్లు చేస్తున్నారు.
ఆసీస్ ఘన విజయం:
తొలి వన్డేలో ఆసీస్ 71 పరుగుల తేడాతో విజయం సాధించింది. టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేసిన ఆసీస్ నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 258 పరుగులు చేసింది. ఓపెనర్లు డేవిడ్ వార్నర్ (67), ఆరోన్ ఫించ్ (60) అర్ధ సెంచరీలు చేసారు. మార్నస్ లబుషేన్ (56) ఫామ్ కొనసాగించాడు. కివీస్ స్పిన్నర్ ఇష్ సోథికి 3 వికెట్లు దక్కాయి. లక్ష్య ఛేదనలో కివీస్ 187 పరుగులకే ఆలౌట్ అయింది. మార్టిన్ గుప్తిల్ (40) టాప్ స్కోరర్. వరుస విరామాల్లో వికెట్లు కోల్పోయి మూల్యం చెల్లించుకుంది. పాట్ కమ్మిన్స్, మిచెల్ మార్ష్ తలో మూడు వికెట్లు తీశారు. ఆసీస్-న్యూజిలాండ్ జట్ల మధ్య మూడు వన్డేలు, మూడు టీ20లు జరగనున్నాయి.