హైదరాబాద్: నాలుగు జట్ల వన్డే సిరీస్లో ఆస్ట్రేలియా-ఏ ఫైనల్కు దూసుకెళ్లింది. ఆస్ట్రేలియా-ఏ ఓపెనర్ ఉస్మాన్ ఖవాజా అద్భుత సెంచరీతో (93 బంతుల్లో 10 ఫోర్లు, 2 సిక్సర్లతో 101 నాటౌట్)తో రాణించడంతో ఆస్ట్రేలియా-ఏ జట్టు చతుర్ముఖ సిరిస్ ఫైనల్లోకి దూసుకెళ్లింది.
సోమవారం జరిగిన ఈ మ్యాచ్లో ఆస్ట్రేలియా-ఏ జట్టు డక్వర్త్ లూయిస్ పద్దతిలో ఐదు వికెట్ల తేడాతో ఇండియా-బిపై విజయం సాధించింది. అయితే ఇప్పటికే రెండు విజయాలతో భారత్ 'బి' ఫైనల్స్కు అర్హత సాధించింది. దీంతో బుధవారం జరిగే ఫైనల్లో మరోసారి ఈ రెండు జట్లు తలపడనున్నాయి.
ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్-బి జట్టు 50 ఓవర్లలో 6 వికెట్లకు 276 పరుగులు చేసింది. మనీశ్ పాండే (117 నాటౌట్; 109 బంతుల్లో 7 ఫోర్లు, 3 సిక్సులు) సెంచరీ సాధించగా... మయాంక్ అగర్వాల్ (36), దీపక్ హుడా (30), ఇషాన్ కిషన్ (31) పరుగులతో రాణించారు.
అనంతరం వర్షం కారణంగా ఆస్ట్రేలియా-ఏ జట్టుకు 40 ఓవర్లలో 247 పరుగుల లక్ష్యాన్ని విధించారు. ఖవాజా సెంచరీతో రాణించడంతో ఆస్ట్రేలియా 40 ఓవర్లలో 5 వికెట్లే కోల్పోయి చేధించింది. ఖవాజాతో పాటు విల్డర్ముత్ (62 నాటౌట్) రాణించాడు. మరో మ్యాచ్లో దక్షిణాఫ్రికా-ఏ జట్టు చేతిలో 4 వికెట్ల తేడాతో ఇండియా-ఏ జట్టు ఓటమిపాలైంది.