హ్యూస్టన్: జాగ్రత్తగా ఉండండి. వచ్చే నెలలో జరిగే తొలి ఎన్బీఏ బాస్కెట్ బాల్ మ్యాచ్ కోసం భారత్కు వస్తా అని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అన్నారు. అమెరికాలోని టెక్సాస్ రాష్ట్రం హ్యూస్టన్లో ఉన్న ఎన్ఆర్జీ స్టేడియంలో ఆదివారం నిర్వహించిన 'హౌడీ-మోడీ' సభ అట్టహాసంగా జరిగింది. 'ఉమ్మడి స్వప్నాలు, ఉజ్వల భవిష్యత్తు' అన్న ట్యాగ్లైన్తో టెక్సాస్ ఇండియా ఫోరం ఈ కార్యక్రమాన్ని నిర్వహించింది. భారత ప్రధాని నరేంద్ర మోడీ, అమెరికా అధ్యక్షుడు ట్రంప్ హాజరయ్యారు. దాదాపు 50వేల మంది ప్రవాస భారతీయులు ఈ సభకు తరలివచ్చారు.
త్రుటిలో పెను ప్రమాదం నుంచి తప్పించుకున్న బౌలర్.. బంతి తలకు తగిలుంటే!!
ప్రధాని మోడీ వేదిక మీదకు రాగానే స్టేడియం మొత్తం 'మోడీ.. మోడీ' అనే నినాదాలతో హోరెత్తింది. మోడీ భారతీయ అమెరికన్లకు శిరస్సు వంచి నమస్కరించారు. అనంతరం ట్రంప్, మోడీ ప్రసంగించారు. ఎన్బీఏ బాస్కెట్ బాల్ను భారత్కు పరిచయం చేయనున్నామని, వచ్చే నెలలో ముంబైలో ఎన్బీఏ మ్యాచ్ జరగనుందని ట్రంప్ తెలిపారు. డొనాల్డ్ ట్రంప్ మాట్లాడుతూ...'వచ్చే నెలలో భారత దేశంలో తొలి ఎన్బీఏ మ్యాచ్కు ఆతిథ్యం ఇవ్వడానికి ముంబై నగరం సిద్ధమవుతుంది. ముంబైలో వేలాది మంది మొట్టమొదటి ఎన్బీఏ ఆటను చూస్తారు. మోడీ ఆహ్వానిస్తే భారత్కు వస్తా?. నేనొస్తా కావొచ్చు, జాగ్రత్తగా ఉండండి' అని నవ్వుతూ అన్నారు.
వెంటనే ఎన్బీఏ మ్యాచ్ కోసం భారత్కు రావాలని ట్రంప్ను మోడీ ఆహ్వానించారు. అనంతరం ఇద్దరూ నవ్వులు పూయించారు. మోడీ ఆహ్వానించడంతో వచ్చే నెలలో డొనాల్డ్ ట్రంప్ భారత్ వచ్చే అవకాశం ఉంది. అక్టోబర్ 4, 5న ముంబైలోని డోమ్, ఎన్ఎస్సిఐ, ఎస్విపి స్టేడియంలో సాక్రమెంటో కింగ్స్ మరియు ఇండియన్ పేసర్స్ రెండు ప్రీ-సీజన్ మ్యాచ్లలో పాల్గొననున్నాయి. 'హౌడీ మోడీ' సభకు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ రావడం గంటకుపైగా ఆలస్యం అయింది. హ్యూస్టన్ విమానాశ్రయంలో దిగి ఎన్ఆర్జీ స్టేడియంకు వస్తూ మార్గమధ్యలో ఎయిర్ ఫోర్స్ బేస్ వద్ద ఆగడంతో ఆలస్యం అయింది.