
హైదరాబాద్: విశాఖపట్నం వేదికగా శ్రీలంకతో జరుగుతున్న మూడో వన్డేలో టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని మరోసారి వికెట్ల వెనుక అద్భుత ప్రదర్శనతో మెప్పించాడు. దీంతో శ్రీలంక ఓపెనర్ ఉపుల్ తరంగ 95( 82 బంతులు, 12 ఫోర్లు, 3 సిక్సులు) తృటిలో సెంచరీని చేజార్చుకున్నాడు.
మ్యాచ్ ఆరంభం నుంచే టీమిండియా బౌలర్లపై ఎదురుదాడి దిగి, వరుస బౌండరీలు బాదిన తరంగ.. చైనామన్ బౌలర్ కుల్దీప్ యాదవ్ బౌలింగ్లో కాస్త ఇబ్బందిపడ్డాడు. దీన్ని గమనించిన ధోనీ.. కుల్దీప్తో కలిసి వ్యూహం రచించి తరంగని పెవిలియన్కు చేర్చాడు.
ఇన్నింగ్స్ 28వ ఓవర్ వేసిన కుల్దీప్ యాదవ్.. ఆఫ్ స్టంప్ని లక్ష్యంగా చేసుకుని బంతుల్ని విసిరి.. కొంచెం క్రీజు వెలుపలికి టర్న్ చేస్తూ వచ్చాడు. దీంతో ఆ ఓవర్లోని రెండో బంతిని అందుకునేందుకు క్రీజు వెలుపలికి పాదం కదిపిన తరంగ.. బంతి అందకపోవడంతో వెంటనే మళ్లీ వెనక్కి వచ్చే ప్రయత్నం చేశాడు.
కానీ.. క్షణాల వ్యవధిలోనే బంతిని అందుకున్న ధోని అంతే వేగంతో వికెట్లను గిరాటేశాడు. ఫీల్డ్ అంపైర్ థర్డ్ అంపైర్ను రివ్యూ కోరగా రిప్లయ్లో తరంగ సరిగ్గా తన లెగ్ ఆన్ది లైన్పై పెట్టె సమయంలో ధోని వికెట్లను గీరేశాడు. థర్డ్ అంపైర్ వికెట్గా ప్రకటించడంతో మైదానంలో అభిమానులు, ఆటగాళ్లు కేరింతలతో ఆనందం వ్యక్తం చేశారు.
దీంతో తరంగ నిరాశగా పెవిలియన్ చేరాడు. ఇదే విధంగా అదే ఓవర్లో ఐదో బంతికి ధోని వ్యూహంతో కుల్దీప్ డిక్వెల్లాను ఔట్ చేశాడు. బంతి వేసే ముందు కుల్దీప్ దగ్గరకు వచ్చిన ధోని స్లిప్లో అయ్యర్ను ఫీల్డింగ్ పెట్టుకోమని సూచించాడు. కుల్దీప్ బంతి విసరగా.. దాన్ని ప్లిక్ చేసేందుకు ప్రయత్నించి డిక్వెల్లా (8) స్లిప్లో ఫీల్డర్ శ్రేయాస్ అయ్యర్ చేతికి చిక్కాడు.
ఈ వికెట్తో ధోని వ్యూహం ఫలించింది. దీంతో 27.5 ఓవర్లు ముగిసే సమయానికి శ్రీలంక 4 వికెట్లు కోల్పోయి 168 పరుగులు చేసింది.