సిమ్లా: కామన్వెల్త్ గేమ్స్లో భారత ప్రదర్శన చాలా మెరుగుపడిందని.. మనం కొత్త భారత్ వైపు అడుగులు వేస్తున్నామని కేంద్ర యువజన వ్యవహారాలు & క్రీడల మంత్రి అనురాగ్ ఠాకూర్ మంగళవారం తెలిపారు. 'హర్ ఘర్ తిరంగ అభియాన్'లో భాగంగా పీటర్హాఫ్లో నెహ్రూ యువకేంద్ర సఘ్థాన్ (NYKS), నేషనల్ సర్వీస్ స్కీమ్ (NSS) వాలంటీర్లతో సంభాషించిన ఠాకూర్ మాట్లాడుతూ.. కామన్వెల్త్ గేమ్స్లో భారత్ మంచి ప్రదర్శన కనబరిచింది. వెయిట్లిఫ్టింగ్లో మునుపెన్నడూ లేని రీతిలో మన వెయిట్ లిఫ్టర్లు రాణించారు. ఓవరాల్గా భారత్ ప్రదర్శన చాలా మెరుగుపడింది. మొత్తంగా 61పతకాలు సాధించింది. రన్నింగ్ ఈవెంట్లలో కెన్యాపై ఆధిపత్యం చెలాయించేలా మన అథ్లెట్లు రేస్లో పాల్గొన్నారంటూ' అని అనురాగ్ ఠాకూర్ అన్నాడు.
'భారత్ మరింత పటిష్ఠంగా, మెరుగ్గా అభివృద్ధి చెందుతోంది. నాలుగేళ్ల క్రితం గోల్డ్ కోస్ట్లో సాధించిన పతకాల కంటే కేవలం ఐదు మాత్రమే తక్కువ వచ్చాయి. ఈ సారి కొన్ని ఈవెంట్లు మిస్సయిన విషయాన్ని మర్చిపోవద్దు' అని ఆయన చెప్పారు. కేంద్ర సమాచార మరియు ప్రసార శాఖ మంత్రిగా కూడా అనురాగ్ ఠాకూర్ పనిచేస్తున్నారు. NYKS, NSS వాలంటీర్లతో మాట్లాడి ఎన్నో విలువైన అభిప్రాయాలను తెలుసుకున్నారు. యూత్ ఎక్స్ఛేంజీ కార్యక్రమం, ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ కార్యక్రమం, NYKS NSS లాంటి వాటిల్లో యువత చురుగ్గా పాల్గొనాలని పిలుపునిచ్చారు.
భవిష్యత్తులో కూడా యువత అభిప్రాయాలు ప్రభుత్వానికి చేరేలా దేశవ్యాప్తంగా ఇలాంటి యూత్ ఎక్స్ఛేంజీ కార్యక్రమాలను నిర్వహించేందుకు కృషి చేస్తానన్నారు. ఇంటింటికీ త్రివర్ణ పతాక ప్రచారం ఘనంగా నిర్వహించాలని పిలుపునిచ్చారు. యువత ఆజాదీ కా అమృత్ మహోత్సవాన్ని ఘనంగా జరుపుకోవాలని, పౌరులందరూ ఆగస్టు 13 నుంచి 15 వరకు తమ ఇళ్లపై జాతీయ జెండాలు ఎగుర వేయాలని ఆయన పిలుపునిచ్చారు.