సెలక్టర్లు సరిగా ఉపయోగించుకోవడం లేదు:
తాజాగా ఉమేశ్ యాదవ్ ఓ జాతీయ మీడియాతో మాట్లాడుతూ... 'నా బౌలింగ్ నైపుణ్యాన్ని ప్రజలు తప్పుగా అర్థం చేసుకుంటున్నారు. బంతి తెల్లదైనా, ఎర్రదైనా దాన్ని స్వింగ్ చేయడమే నా పని. ఇదివరకే అది చేశా, ఇకపైనా చేయగలను. వరుసగా పలు వన్డే సిరీసుల్లో అవకాశాలిస్తే.. వికెట్లు తీసే బౌలర్గా నిరూపించుకుంటా. నన్ను సెలక్టర్లు వన్డేల్లో సరిగా ఉపయోగించుకోవడం లేదు. నాకు విశ్రాంతి ఇచ్చిన తర్వాత వన్డే ఆడటానికి ఆరు నెలలు నిరీక్షించాల్సి వచ్చింది. ఇది కచ్చితంగా కష్టమే' అని అన్నాడు.
సరైన పనే లేదు:
'నా కెరీర్ ఎప్పుడూ నిలకడగా లేదు, ఒడుదొడుకుల్లోనే సాగుతోంది. 2015 ప్రపంచకప్లో మంచి ప్రదర్శన చేసినా తర్వాత ఇంటికే పరిమితమయ్యా. అది ఎందుకో నాకు అర్థం కావడం లేదు. ఎక్కడా వైట్ బాల్ క్రికెట్.. రెడ్ బాల్ క్రికెట్ అనే సమస్య ఉండదు. ఒక వన్డే సిరీస్ అంతా నాకు అవకాశం ఇస్తే.. నేను ఏమిటో నిరూపించుకునే అవకాశం మళ్లీ దొరుకుతుంది. ఇక్కడ నేను ఎవర్నీ తప్పుబట్టడం లేదు. వర్క్లోడ్ అంటూ తప్పిస్తున్నారు. కానీ.. నాకు సరైన పనే లేదనేది నా భావన' అని ఉమేశ్ పేర్కొన్నాడు.
ఆరు నెలలకోసారి ఆడితే:
'తుది జట్టులో స్థానం కోసం ఎంతో పోటీ ఉంటుంది. మిగతా ముగ్గురు పేసర్లను వేలెత్తి చూపాల్సిన అవసరం లేదు. ఇషాంత్ శర్మ, మహ్మద్ షమీ, జస్ప్రీత్ బుమ్రా బాగా బంతులేస్తారు. తామంతా అనుభవజ్ఞులైన బౌలర్లమే. దీంతో తుది జట్టును ఎంపిక చేయడం జట్టు యాజమాన్యానికి అంత తేలిక కాదనే విషయాన్ని అర్థం చేసుకోగలను. ఆటగాళ్లు ఆరు నెలలకోసారి ఆడితే మానసిక ఒత్తిడి ఉండదు' అని ఉమేశ్ చెప్పుకొచ్చాడు.
విదేశాల్లో రాణించలేడనే ముద్ర:
టీమిండియా తరఫున 46 టెస్టులాడిన ఉమేశ్ యాదవ్.. 144 వికెట్లు పడగొట్టాడు. ఇందులో 28 మ్యాచ్లను భారత్ గడ్డపై ఆడి 96 వికెట్లు తీయగా.. మిగిలిన 18 మ్యాచ్లను విదేశీ గడ్డపై ఆడి 48 వికెట్లు తీశాడు. దీంతో విదేశాల్లో ఉమేశ్ రాణించలేడనే ముద్ర పడిపోయింది. ఇక 75 వన్డేలు ఆడిన ఉమేశ్.. 106 వికెట్లు తీశాడు. 2018 నుంచి చూస్తే ఉమేశ్ ఆడిన వన్డేలు నాలుగు మాత్రమే. ఉమేశ్ జాతీయ జట్టులో చేరి ఎనిమిదేళ్లు గడుస్తున్నా అతడి కెరీర్ ఎలా సాగుతుందో చెప్పడానికి ఈ గణంకాలే నిదర్శనం.