బౌలర్లు గొప్పగా పోరాడారు:
మ్యాచ్ అనంతరం భారత కెప్టెన్ ప్రియమ్ గార్గ్ మీడియాతో మాట్లాడాడు. 'ఈ రోజు మాది కాదు. బాయ్స్ మంచి ప్రదర్శన ఇచ్చారు. అయితే ఫలితం మాత్రం మాకు అనుకూలంగా రాలేదు. మేము పోరాడిన విధానంతో చాలా సంతోషంగా ఉన్నాం. లక్ష్యం చిన్నదైనా మా బౌలర్లు గొప్పగా పోరాడారు. ఫలితంలో టాస్ పాత్ర ఏమీ లేదని భావిస్తున్నా. వికెట్లో మాత్రం ఏదో ఉంది' అని ప్రియమ్ గార్గ్ అన్నాడు.
177 స్కోరు గొప్పది కాదు:
'బంగ్లాదేశ్ బౌలర్లు మ్యాచ్ ఆరంభం నుంచి కట్టుదిట్టంగా బౌలింగ్ చేశారు. మా బ్యాట్స్మన్ కూడా బాగా ఆడారు. కానీ మరికొన్ని పరుగులు సాధించాల్సి ఉండే. భారీ స్కోరు చేయలేకపోయాం. 215-220 పరుగులు చేయాల్సింది. 177 స్కోరు గొప్పది కాదు. బంగ్లాదేశ్ బాగా బ్యాటింగ్ చేసింది. మా బౌలర్ల ఆటతో చాలా సంతోషంగా ఉన్నా. దక్షిణాఫ్రికాలో ఆడటం మంచి అనుభవం. ప్రపంచకప్కు ముందు మేము ఇక్కడ సిరీస్ ఆడాం. అది మాకు కలిసివచ్చింది' అని ప్రియమ్ గార్గ్ తెలిపాడు.
బంగ్లా ఆటగాళ్లు అతి చేశారు:
'ఓటమిని స్వీకరించాం. ఆటలో గెలుపోటములు సహజమే. కానీ.. బంగ్లా ఆటగాళ్లు మాత్రం అతి చేశారు. వారు ప్రవర్తించిన తీరు చెత్తగా ఉంది. ఇలా జరగకుండా ఉండాల్సింది' అని ప్రియమ్ గార్గ్ చెప్పుకొచ్చాడు. ఇదిలా ఉంటే.. ఈ ఘటనపై ఐసీసీ కూడా సీరియస్గా ఉన్నట్లు తెలిసింది. ఘటనకు సంబంధించిన ఫుటేజీని తెప్పించుకుని పరిశీలిస్తున్నట్లు సమాచారం.
మ్యాచ్ గెలిస్తే బాగుండేది:
'ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్'గా నిలిచిన యశస్వి జైస్వాల్ మాట్లాడుతూ... 'నేను టోర్నమెంట్ను బాగా ఆనందించాను. ఇక్కడ ఎలా ఆడాలనే దానిపై నాకు ఓ మంచి అనుభవం వచ్చింది. నేను నా ఆటను ఇంకా ఆడాల్సి ఉందని నాకు తెలుసు. ఇంకా మెరుగ్గా ఎలా ఆడాలో ఆలోచిస్తున్నా. నా ఆటకు కట్టుబడి ఉండాలనుకుంటున్నా. పరుగులు చేసినందుకు సంతోషంగా ఉంది. ఫైనల్ మ్యాచ్ గెలిస్తే బాగుండేది' అని అన్నాడు.