
హైదరాబాద్: విదేశీ పర్యటనల్లో టీమిండియా ఓపెనర్ శిఖర్ ధావన్ ఎప్పటికీ అభిమానులను కలవరపాటుకు గురి చేస్తూనే ఉంటుంది. ప్రస్తుతం ఇంగ్లాండ్ వేదికగా జరుగుతున్న ఐదు టెస్టు మ్యాచ్ల సిరిస్లో కూడా శిఖర్ ధావన్ పేలవ ప్రదర్శన కనబరుస్తున్నాడు.
ఎడ్జ్ బాస్టన్ వేదికగా జరిగిన తొలి టెస్టు తొలి ఇన్నింగ్స్లో 26 పరుగులు చేసిన ధావన్, ఇక, రెండో ఇన్నింగ్స్లో 13 పరుగులకే పెవిలియన్కు చేరాడు. ఈ నేపథ్యంలో ధావన్ ఆటతీరుపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ఐదు టెస్టు మ్యాచ్ల సిరిస్లో ఇప్పటికే మొదటి మూడు టెస్టులకు భారత జట్టుని సెలక్టర్లు ప్రకటించిన సంగతి తెలిసిందే.
దీంతో చివరి రెండు టెస్టులకైనా ధావన్ని తప్పించి అతడి స్థానంలో దక్షిణాఫ్రికా-ఏతో జరుగుతున్న అనధికారిక టెస్టు మ్యాచ్లో అద్భుత ప్రదర్శన చేస్తోన్న మయాంక్ అగర్వాల్ లేద్ పృథ్వీషాలను ఎంపిక చేస్తే జట్టుకు మేలు జరుగుతుందని నెటిజన్లు ట్విట్టర్లో ట్రోల్ చేస్తున్నారు.
ప్రస్తుతం బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో దక్షిణాఫ్రికా-ఎతో జరుగుతున్న తొలి అనధికార టెస్టు మ్యాచ్లో భారత్ ఓపెనర్ మయాంక్ అగర్వాల్ (220 బ్యాటింగ్; 250 బంతుల్లో 31 ఫోర్లు, 4 సిక్సులు) అజేయ డబుల్ సెంచరీ బాదడంతో టీమిండియా భారీ స్కోరు దిశగా సాగుతోంది.
ఆదివారం రెండో రోజు ఆట ముగిసే సమయానికి భారత్ తొలి ఇన్నింగ్స్లో 2 వికెట్లకు 411 పరుగులు చేసింది. మయాంక్తో పాటు మరో ఓపెనర్ పృథ్వీ షా (136; 196 బంతుల్లో 20 ఫోర్లు, ఒక సిక్స్) సెంచరీతో మెరిశాడు. మయాంక్-పృథ్వీ జోడీ తొలి వికెట్కు 277 పరుగుల భారీ భాగస్వామ్యాన్ని నెలకొల్పారు.
ఈ నేపథ్యంలో ఇంగ్లాండ్తో జరిగే చివరి రెండు టెస్టులకు ధావన్ను తప్పించి అతడి స్థానంలో వీరిద్దరిలో ఎవరో ఒకరిని ఎంపిక చేస్తే బాగుంటుందని నెటిజన్లు అంటున్నారు. కాగా, తొలి టెస్టులో కెప్టెన్ కోహ్లీ మినహాయించి మిగతా బ్యాట్స్మెన్ పూర్తిగా విఫలమయ్యారు. దీంతో కచ్చితంగా గెలుస్తారని అనుకున్న మ్యాచ్లో టీమిండియా 31 పరుగుల తేడాతో ఓడిపోయింది.