
హైదరాబాద్: టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ, అతని భార్య అనుష్క శర్మలపై నెటిజన్లు సోషల్ మీడియాలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గత, శనివారం కోహ్లీ, అనుష్క శర్మలు కారులో వెళుతుండగా పక్కనే కారులో వెళుతున్న అర్హాన్ సింగ్ అనే వ్యక్తి ప్లాస్టిక్ కవర్ను రోడ్డుపై పడేశాడు.
దీనిని గమనించిన అనుష్క శర్మ కారు విండో కిందకి దించి, ఎందుకు చెత్త అలా రోడ్డుపై పడేసారని అతడి ప్రవర్తనపై ఆగ్రహం వ్యక్తం చేశారు. "రోడ్డుపై చెత్త వేసేటప్పుడు కాస్త ఆలోచించండి. తర్వాత నుంచి చెత్త డబ్బాను వాడండి" అని అనుష్క సున్నితంగా అతడిలో మాట్లాడింది.
అయితే, ఆ వ్యక్తి అనుష్క మాటలను ఏ మాత్రం లెక్క చేయకుండా.. ధీమాగా ఉండటంతో పాటు తాను చేసిన తప్పును ఒప్పుకోకపోయే సరికి, అనుష్క కోపంతో ఊగిపోయింది. అనుష్క అతడిపే కేకలు వేస్తోన్న సమయంలో కారులో పక్కనే ఉన్న కోహ్లీ వీడియోని తీసి ట్విటర్లో పోస్ట్ చేశాడు.
"చూడండి... ఈ వ్యక్తులు రోడ్డు మీదే చెత్తను విసిరివేశారు. లగ్జరీ కారులో ప్రయాణించే వారికి, మెదడు పోయినట్టుంది. ఇలాంటి వ్యక్తులు మన దేశాన్ని శుభ్రం చేస్తారా? అవును నిజం! ఇలాంటి వాటిని కనుక మీరు చూస్తే, వెంటనే ఇదే విధంగా చేయండి. అవగాహనను కల్పించండి" అని వీడియోని షేర్ చేశాడు. ఈ వీడియోపై తాజాగా నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
"మీరు సెలబ్రిటీ. మ్యాచ్ల్లో నోటికొచ్చినట్లు మాట్లాడుతుంటారు. మీరు బూతులు మాట్లాడినప్పుడలా కెమెరాను స్లోమోషన్లో పెట్టొద్దు అని చెప్తారా? మిమ్మల్ని చూసి చాలా మంది అలా తిట్టడం ఫ్యాషన్ అనుకుంటున్నారు. అప్పుడు మీ విలువలు ఏమైపోయాయి?" అని నెటిజన్ కాస్తంత ఘాటుగానే స్పందించాడు.
"అనుష్కకు రోడ్డుపై చెత్త పారేస్తున్నారన్న చింత కంటే.. దానిని వెంటనే వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయాలన్న ఆతృతే ఎక్కువగా ఉన్నట్టుంది. లేకపోతే అనుష్క అంతగా అరుస్తున్నప్పుడు విరాట్ కోహ్లీకి వీడియో తీయాలన్న ఆలోచన ఎలా వస్తుంది?' అని మరో నెటిజన్ మండిపడ్డాడు.
"మీ భార్య హీరోయిజాన్ని వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టాల్సిన అవసరం ఏముంది కోహ్లీ? ఇలా రోడ్డుపై చెత్త వేసేవారిని తొలిసారి చూస్తున్నారా? ఒకవేళ అతనికి బుద్ధిచెప్పాలనుకుంటే స్నేహపూర్వకంగా మాట్లాడాలి. అంతేకానీ బాస్లా ప్రవర్తించకూడదు" అంటూ కామెంట్ల మీద కామెంట్లు చేస్తున్నారు.
మరొవైపు అర్హాన్ సింగ్ ఫేస్బుక్ ద్వారా తాను చేసిన పనికి క్షమాపణలు చెప్పినప్పటికీ, విరాట్ కోహ్లీ-అనుష్క ప్రవర్తన పట్ల తీవ్రనిరసన వ్యక్తం చేశాడు. ''అనుష్కా, కాస్త మర్యాదగా, పద్ధతిగా చెప్పడం నీ స్టార్డమ్ను తగ్గిస్తుందా'' అంటూ పేస్బుక్లో ప్రశ్నించాడు.
''నేను ఈ పోస్ట్ సంచలనం కోసం పెట్టట్లేదు. నేను కారులోంచి ఒక చిన్న ప్లాస్టిక్ వస్తువును రోడ్డుమీద వేశాను. పక్కన వెళ్తున్న ఒక కారు అద్దం కిందకు తీయగానే, అందమైన అనుష్క ఏదో రోడ్డు పక్క మనిషిలా నాపై అరిచింది. సరే, నా తప్పుకు పశ్చాత్తాపం వ్యక్తం చేస్తున్నా. మరి మర్యాదగా, పద్ధతిగా చెప్పడం నీ స్టార్డమ్ను తగ్గిస్తుందా అనుష్కా? ప్రపంచంలో అనేక శుభ్రతలున్నాయి. వాటిలో మర్యాదగా మాట్లాడటం ఒకటి. నీ నోటి వెంట వచ్చిన చెత్తతో పోలిస్తే, నేను వేసింది చాలా తక్కువ. ఈ మొత్తం తతంగాన్ని కోహ్లీ నెట్లో పెట్టడం అన్నింటికంటే పెద్ద చెత్త'' అంటూ ఆగ్రహం వ్యక్తం చేశాడు.
ఈ ఘటనపై అర్హాన్ సింగ్ తల్లి కూడా స్పందించారు. తన కుమారుడు చేసింది తప్పే కానీ అతన్ని పట్టుకుని రోడ్డుపై అలా తిట్టడం ఎంతమాత్రం సబబు కాదని ఆమె పేర్కొంది.