
హైదరాబాద్: నవరాత్రులను పురస్కరించుకుని టీమిండియా హెడ్ కోచ్ రవిశాస్త్రి చేసిన ఓ ట్వీట్పై నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు. సోమవారం నుంచి దసరా నవరాత్రులు ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో హెడ్ కోచ్ రవిశాస్త్రి తన ట్విట్టర్ వేదికగా ప్రతి ఒక్కరికీ నవరాత్రి శుభాకాంక్షలు తెలిపాడు.
ఈ సందర్భంగా తన ట్విట్టర్లో "నవరాత్రి శుభ సందర్భంగా దుర్గ మాత ప్రాతినిధ్యం వహిస్తున్న అన్ని అవతారాలను జరుపుకుందాం. మీకు, మీరు ప్రేమించే ప్రతి ఒక్కరికీ నవరాత్రి శుభాకాంక్షలు" అంటూ దుర్గా మాత ఫోటోతో పోస్టు పెట్టాడు. ఈ ట్వీట్పై నెటిజన్లు తమదైన శైలిలో స్పందిస్తున్నారు.
"ఈ తొమ్మిది రోజులు మందు కొట్టడం ఆపండి" అంటూ ఓ నెటిజన్ ట్వీట్ చేయగా... మరొక నెటిజన్ "అంకుల్ నవరాత్రుల సందర్భంగా మందు తాగకండి" అంటూ ట్వీట్ చేశారు. ప్రస్తుతం రవిశాస్త్రి ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అయింది.
ఇటీవలే కపిల్దేవ్ నేతృత్వంలోని క్రికెట్ సలహా కమిటీ రవిశాస్త్రికే హెడ్కోచ్గా పట్టం కట్టిన సంగతి తెలిసిందే. ఫలితంగా 2017 నుంచి జట్టు కోచ్గా వ్యవహరిస్తున్న శాస్త్రి మరో రెండేళ్ల పాటు ఆ బాధ్యతలు నిర్వర్తించనున్నాడు. బీసీసీఐ ప్రెసిడెంట్ ఎన్ శ్రీనివాసన్ హయాంలో రవిశాస్త్రి మొదటిసారిగా 2014 ఆగస్టులో భారత జట్టు డైరెక్టర్గా నియమించబడ్డాడు.
ఆ సమయంలో ఇంగ్లాండ్ పర్యటన జరుగుతోంది. అప్పటికే డంకన్ ఫ్లెచర్ కోచ్గా విఫలమయ్యాడు, ప్రపంచకప్ 2015 దగ్గరలో ఉండడంతో రవిశాస్త్రి పగ్గాలు అందుకున్నాడు. అనిల్ కుంబ్లే అనంతరం 2017లో హెడ్ కోచ్గా రవిశాస్త్రి ఎంపికయ్యాడు. రవిశాస్త్రి హెడ్ కోచ్గా ఉన్న సమయంలో టీమిండియా అనేక అద్భుతమైన విజయాలను సాధించింది.
ఈ ఏడాది మొదట్లో 71 ఏళ్ల తర్వాత ఆస్ట్రేలియా గడ్డపై టీమిండియా ఆస్ట్రేలియాను ఓడింటి టెస్టు సిరిస్ను సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. రవిశాస్త్రి కోచింగ్లో టీమిండియా సాధించిన అతిపెద్ద విజయం ఇదే. ఇక, టీమిండియా తరుపున 80 టెస్టులు, 150 వన్డేలు ఆడిన రవిశాస్త్రి ఆరువేలకు పైగా పరుగులు చేయడంతో పాటు 250 వికెట్లు పడగొట్టాడు.