|
స్పష్టంగా కనిపిస్తోన్నా ఔట్ ఎలా ఇస్తారంటూ
కోహ్లీని ఔట్గా ప్రకటిస్తూ థర్డ్ అంపైర్ నైగెల్ లాంగ్ తీసుకున్న నిర్ణయాన్ని భారత అభిమానులు తప్పుబడుతున్నారు. బంతి నేలను తాకుతున్నట్టు స్పష్టంగా కనిపిస్తోన్నా ఔట్ ఎలా ఇస్తారంటూ లాంగ్పై మండిపడుతున్నారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో దీనిపైనే చర్చ. కోహ్లీ ఔట్ వివాదంపై భారత క్రికెట్ అభిమానులు వరసపెట్టి ట్వీట్లు చేస్తున్నారు. వాటిలో కొన్ని నవ్వు తెప్పించే విధంగా ఉన్నాయి.
|
సుప్రీం కోర్టులో పిటిషన్ వేయాలని
థర్డ్ అంపైర్ నిర్ణయంపై ఒకరు ట్వీట్ చేస్తూ.. ‘ఈ నిర్ణయానికి వ్యతిరేకంగా సుప్రీం కోర్టులో పిటిషన్ వేయాలని అనుష్క శర్మను నేను కోరుతున్నాను' అని పేర్కొన్నారు. ఇలాంటి సరదా ట్వీట్లు చాలానే ఉన్నాయి. వీటితో పాటు థర్డ్ అంపైర్పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ చేసిన ట్వీట్లు కూడా ఉన్నాయి. కేవలం థర్డ్ అంపైర్పై మాత్రమే కాకుండా క్యాచ్ పట్టిన హ్యాండ్స్కాంబ్, ఆసీస్ కెప్టెన్ టిమ్ పైన్పై కూడా నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. హ్యాండ్స్కాంబ్కు క్రీడా స్ఫూర్తి లేదంటూ ట్వీట్లు చేస్తున్నారు.
|
మండిపడుతున్న క్రికెట్ అభిమానులు
రీప్లేలో చూపినదాని ప్రకారం బంతి స్వల్పంగా నేలను తాకి హ్యాండ్స్కాంబ్కు చిక్కినట్లు కనిపించింది. అయితే అది స్పష్టంగా లేకపోవడంతో థర్డ్ అంపైర్.. ఫీల్డ్ అంపైర్ నిర్ణయానికే మద్దతు తెలిపి ఔట్గా ప్రకటించాడు. దీంతో అంపైర్ నిర్ణయంపై క్రికెట్ అభిమానులు మండిపడుతున్నారు.
|
రెండో వాడిగా నిలిచిన విరాట్
కాగా, పెర్త్లో జరుగుతోన్న రెండో టెస్టులో కోహ్లీ (123; 257 బంతుల్లో 13ఫోర్లు, 1సిక్సు) సెంచరీ చేసిన విషయం తెలిసిందే. ఈ సెంచరీతో కోహ్లీ పలు రికార్డులు నెలకొల్పాడు. సచిన్ టెండూల్కర్ (1992) తర్వాత పెర్త్లో ఓ భారత క్రికెటర్ సెంచరీ సాధించడం ఇదే తొలిసారి. అలాగే అతి తక్కువ ఇన్నింగ్స్ల్లో 25 సెంచరీలు సాధించిన రెండో బ్యాట్స్మన్గానూ కోహ్లీ నిలిచాడు. ఆసీస్ దిగ్గజ క్రికెటర్ సర్ డాన్ బ్రాడ్మాన్ 68 ఇన్నింగ్స్ల్లో 25 సెంచరీలు సాధించగా.. ఆయన తర్వాత విరాట్ కోహ్లీ 127 ఇన్నింగ్స్లో ఆ మైలురాయిని అందుకున్నాడు. సచిన్ 130 ఇన్నింగ్స్లతో మూడో స్థానానికి పరిమితమయ్యాడు.