
హైదరాబాద్: రోహిత్ శర్మ వన్డేల్లో మూడు డబుల్ సెంచరీలు బాదిన ఏకైక ఆటగాడు. అయితే, టెస్టుల్లో మాత్రం రోహిత్ శర్మ ట్రాక్ రికార్డు ఏమాత్రం బాగాలేదు. భారత్ తరుపున ఇప్పటివరకు 25 టెస్టు మ్యాచ్లాడిన రోహిత్ శర్మ 39.97 యావరేజితో 1479 పరుగులు చేశాడు.
ఇందులో మూడు సెంచరీలు ఉన్నాయి. గత కొన్నేళ్లుగా పరిమిత ఓవర్ల క్రికెట్లో రోహిత్ శర్మ అద్భుత ప్రదర్శన చేస్తున్నప్పటికీ... అతడి ప్రదర్శనను టెస్టుల్లో పరిగణనలోకి తీసుకోవడం లేదు సెలక్టర్లు. స్వదేశంలో 9 టెస్టు మ్యాచ్లాడిన రోహిత్ శర్మ కేవలం 769 పరుగులు మాత్రమే చేశాడు.
ఇక, విదేశాల్లో జరిగిన టెస్టుల్లో అయితే రోహిత్ శర్మ రికార్డు మరీ పేలవంగా ఉంది. విదేశీగడ్డపై 16 టెస్టులాడిన రోహిత్ 25.35 యావరేజితో 710 పరుగులు మాత్రమే చేశాడు. ఈ ఏడాది ఆరంభంలో దక్షిణాఫ్రికా పర్యటనకు వెళ్లిన భారత టెస్టు జట్టులో రోహిత్ శర్మ చోటు దక్కించుకున్నాడు.
సఫారీ గడ్డపై మూడు టెస్టు మ్యాచ్లకు గాను రెండు టెస్టుల్లో ఆడిన రోహిత్ శర్మ 78 పరుగులు మాత్రమే చేశాడు. ఇక, ఇంగ్లండ్తో జరగనున్న ఐదు టెస్టు మ్యాచ్ల సిరీస్కు భారత జట్టును బీసీసీఐ ప్రకటించింది. తొలి మూడు టెస్ట్లకు సెలక్షన్ కమిటీ 18 మందితో కూడిన జట్టుని ప్రకటించింది.
అయితే, ఈ జట్టులో రోహిత్ శర్మకు సెలక్టర్లు చోటివ్వలేదు. ఇంగ్లాండ్ పర్యటనని మెరుగ్గా ఆరంభించిన రోహిత్ శర్మకు మాత్రం సెలక్టర్లు మొండిచేయి చూపించడంపై అతడి టెస్టు కెరీర్ ముగిసినట్లేనని భావిస్తున్నారు. మూడో టీ20లో కేవలం 56 బంతుల్లోనే 11 ఫోర్లు, 5 సిక్సుల సాయంతో 100 పరుగులతో నాటౌట్గా నిలిచాడు.
ఆ తర్వాత తొలి వన్డేలోనూ 114 బంతుల్లో 15 ఫోర్లు, 4 సిక్సుల సాయంతో 137 పరుగులతో నాటౌట్గా నిలిచాడు. అయినా సరే, టెస్టు జట్టు ఎంపికలో రోహిత్ శర్మ ప్రదర్శనని సెలక్టర్లు పరిగణలోకి తీసుకోకపోవడం ఆశ్చర్యం కలిగించింది. దీనిపై రోహిత్ శర్మ తన ట్విట్టర్లో "సూర్యుడు మళ్లీ తిరిగి రేపు ఉదయిస్తాడు" అని పాజిటివ్ దృక్పథంతో పేర్కొన్నాడు.
రోహిత్ శర్మ ట్వీట్పై సోషల్ మీడియాలో నెటిజన్లు భిన్నంగా స్పందించారు. "రోహిత్ నువ్వు టైగర్వి మళ్లీ జట్టులో చోటు దక్కించుకుంటావ్" అని ఓ నెటిజన్ ట్వీట్ చేయగా, "నాకు తెలుసు.. సూర్యుడు ఒక నెల తర్వాత కూడా ఉదయిస్తాడు" అని మరొకి నెటిజన్ ట్వీట్ చేశాడు.