
హైదరాబాద్: పరుగుల యంత్రం.. టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ఈ సారి స్టైల్ మార్చాడు. ఏ మాత్రం దూకుడు లేకుండా వెస్టిండీస్పై నిదానంగా పరుగులు రాబట్టాడు. ఈ సెంచరీతో కోహ్లీ అనేక రికార్డులను బద్దలు కొట్టాడు. రాజ్కోట్ వేదకగా వెస్టిండిస్తో జరుగుతున్న తొలి టెస్టులో కోహ్లీతో పాటుగా తొలి రోజు ఆటలో యువకెరటం పృథ్వీ షా సెంచరీ చేయగా.. పంత్ (92), పుజారా(86)లు అవకాశాన్ని చేజార్చుకున్నారు. రవీంద్ర జడేజా సైతం తన కెరీర్లో మొట్టమొదటి సెంచరీని పూర్తి చేసుకున్నాడు.
రాజ్కోట్ వేదికగా టీమిండియాతో జరుగుతున్న తొలి టెస్టులో పర్యాటక వెస్టిండిస్ జట్టు విలవిల్లాడుతోంది. శుక్రవారం రెండో రోజు ఆట ముగిసే సమయానికి వెస్టిండిస్ జట్టు 29 ఓవర్లకు గాను 6 వికెట్లు కోల్పోయి 94 పరుగులు చేసి కష్టాల్లో పడింది. ప్రస్తుతం క్రీజులో రోస్టన్ చేజ్(27 బ్యాటింగ్), కీమో పాల్(13 బ్యాటింగ్) పరుగులతో ఉన్నారు. వెస్టిండీస్తో జరుగుతున్న తొలి టెస్ట్లో భారత ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తూ 649పరుగులకు 8వికెట్ల నష్టంతో డిక్లేర్ ప్రకటించింది.
రెండో రోజైన శుక్రవారం విరాట్ కోహ్లీ(137) సెంచరీ చేశాడు. టెస్టుల్లో కోహ్లీకి ఇది 24వ సెంచరీ. ఈ ఏడాది టెస్టుల్లో కోహ్లీకి ఇది నాలుగో సెంచరీ. 123 ఇన్నింగ్స్ల్లో 24వ సెంచరీ చేసిన విరాట్ కోహ్లీ, ఆస్ట్రేలియా మాజీ క్రికెట్ దిగ్గజం డాన్ బ్రాడ్మాన్ తర్వాత అత్యంత వేగంగా 24 టెస్టు సెంచరీలు చేసిన ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు. 125 ఇన్నింగ్స్ల్లో సచిన్ టెండూల్కర్ ఈ జాబితాలో మూడో స్థానంలో ఉన్నాడు. అంతేకాదు అంతర్జాతీయ క్రికెట్లో విరాట్ కోహ్లీకి ఇది 50వ సెంచరీ.
ఈ క్రమంలో కోహ్లీని అభినందిస్తూ ట్విట్టర్ వేదికగా ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. సచిన్ టెండూల్కర్ కోహ్లీని పొగడ్తలతో ముంచెత్తాడు. 'మరో సెంచరీని పూర్తి చేయడమనేది గొప్ప అలవాటు. ఇలానే కొనసాగించు' అని సచిన్ తన అధికారిక ట్విట్టర్ ద్వారా శుభాకాంక్షలు తెలిపాడు. 'కెప్టెన్ సెంచరీకి మరో రోజు తోడైంది.' అంటూ ఆర్పీ సింగ్ తెలుపగా .. వినోద్ కాంబ్లీ తన ట్వీట్లో ఒకప్పుడు ఇలా చేయడం సచిన్ టెండూల్కర్కు సాధ్యమైంది. ఇప్పుడు నీకు కుదురుతోంది. 'సెంచరీకి కంగ్రాచ్చులేషన్స్' అంటూ ట్వీట్ చేశాడు.