ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంటున్న ధోనీ సేన
ఐపీఎల్లో విజయంతో పునరాగమనం చేసిన చెన్నై సూపర్కింగ్స్ ఇప్పుడు సొంతగడ్డపై కోల్కతా నైట్రైడర్స్తో పోరుకు సిద్ధమైంది. రెండేండ్ల నిషేధం కారణంగా మే 2015 తర్వాత చెన్నై సూపర్కింగ్స్ చెపాక్ స్టేడియంలో ఆడనుండడం ఇదే తొలిసారి. దీంతో ఈ మ్యాచ్ను ధోనీ సేన ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంటున్నది.
అదే జోరును కొనసాగిస్తూ
ఆల్రౌండర్ బ్రావో సూపర్ ఫామ్లో ఉండటం చెన్నైకి కలిసొచ్చే అంశం. గత మ్యాచ్లో విఫలమైన రైనా ఈసారి భారీ ఇన్నింగ్స్పై దృష్టి పెట్టాడు. కాగా గాయం కారణంగా కేదార్ జాదవ్ ఐపీఎల్కే దూరమవడం ఆ జట్టుకు కొంత లోటని చెప్పొచ్చు. ఇతడి స్థానంలో మురళీ విజయ్కు అవకాశం ఇవ్వనున్నారు.
ముగ్గురు కీలకపాత్ర పోషించడం
అదే జరిగితే రాయుడు బ్యాటింగ్ ఆర్డర్లో కిందకి వెళుతాడు. పేస్ బౌలర్ మార్క్వుడ్కు బదులు శార్దూల్ ఠాకూర్ను తీసుకోవాలని భావిస్తే..ఫారిన్ కోటాలో స్యామ్ బిల్లింగ్స్ను రంగంలోకి దింపే అవకాశం ఉన్నది. స్పిన్ విషయానికొస్తే హర్భజన్, ఇమ్రాన్ తాహీర్, జడేజాల త్రయం ముంబైతో జరిగిన మ్యాచ్లో 5 ఓవర్లే వేసింది. అయితే స్పిన్కు అనుకూలించే చెపాక్లో ఈ ముగ్గురు కీలకపాత్ర పోషించడం ఖాయం.
చెన్నైకి చెక్ పెట్టేందుకు ప్రణాళిక:
మరోవైపు దినేశ్ కార్తీక్ సారథ్యంలోని కోల్కతా తొలి మ్యాచ్లోనే బలమైన బెంగళూరుకు షాకిచ్చి ఊపుమీద ఉన్నది. అదే జోరును కొనసాగిస్తూ చెన్నైకి చెక్ పెట్టేందుకు ప్రణాళిక సిద్ధం చేసుకున్నది.
చావ్లాతో సహా సత్తా చాటేందుకు:
కోల్కతా కెప్టెన్, లోకల్ బాయ్ దినేశ్ కార్తీక్ సొంత అభిమానుల మధ్య మరింత రెచ్చిపోయి ఆడేందుకు సిద్ధమయ్యాడు. గత మ్యాచ్లో ఇరుగదీసిన సునీల్ నరైన్ మరోసారి ధనాధన్ అనిపించాలని చూస్తుండగా..క్రిస్ లిన్, ఊతప్ప, నితీశ్ రాణా బ్యాటింగ్ భారాన్నీ మోయనున్నారు. జాన్సన్, వినయ్తో పేస్ ఎటాక్ పటిష్ఠంగా ఉండగా స్పిన్ విభాగంలో కుల్దీప్, నరైన్, చావ్లా సత్తా చాటేందుకు సిద్ధమయ్యారు.
కావేరీ వివాదం..భారీ భద్రత
తమిళనాట రగులుతున్న కావేరీ జల వివాదం నేపథ్యంలో ఈ మ్యాచ్ కోసం 2వేల మంది పోలీసులతో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. కావేరీ బోర్డు ఏర్పాటు చేయాలంటూ ఇప్పటికే అక్కడి ప్రజా సంఘాలు, రాజకీయ పార్టీలు తీవ్ర స్థాయిలో ఉద్యమం చేపట్టాయి. ఇక తమిళగ వాళ్వురిమై కచ్చి నేతలు మ్యాచ్ నిర్వహిస్తే స్టేడియాన్ని ముట్టడిస్తామంటూ హెచ్చరించారు. దీంతో స్టేడియం వద్ద భద్రత కట్టుదిట్టం చేశారు.