
సిడ్నీ: టీ20 క్రికెట్లో రోహిత్ శర్మ, డేవిడ్ వార్నర్ అత్యుత్తమ ఓపెనర్లు అని ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్, సన్రైజర్స్ హైదరాబాద్ కోచ్ టామ్ మూడీ అభిప్రాయపడ్డాడు. మహమ్మారి కరోనా వైరస్ కారణంగా ప్రపంచ వ్యాప్తంగా ఆటలు అన్ని రద్దయ్యాయి. మార్చి 29 నుంచి ప్రారంభం కావాల్సిన ఐపీఎల్-13 సీజన్ కరోనా కారణంగా ఏప్రిల్ 15కి వాయిదా పడింది. వైరస్ వ్యాప్తి రోజురోజుకు పెరుగుతుండడంతో ఐపీఎల్ జరగడం అనుమానంగానే ఉంది. ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు కానీ.. దాదాపు లీగ్ జరగడం అసాధ్యమే.
కరోనా కారణంగా ఆటలన్నీ బంద్ కావడంతో క్రీడాకారులు, మాజీలు సోషల్ మీడియా ద్వారా అభిమానులను పలకరిస్తూ అభిప్రాయాలను వెల్లడిస్తున్నారు. ఈ జాబితాలో టామ్ మూడీ కూడా చేరాడు. ట్విట్టర్లో అభిమానులు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పాడు. ఈ క్రమంలో టీ20 ఫార్మాట్లో అత్యుత్తమ ఓపెనర్స్ ఎవరు? అని ఒక అభిమాని ప్రశ్నించగా.. రోహిత్ శర్మ, డేవిడ్ వార్నర్ అని మూడీ వెంటనే సమాధానమిచ్చాడు. అలాగే భారత యువ ఆటగాడు శుభమన్ గిల్ను కూడా ఎంపిక చేసుకున్నాడు.
ఇక భారత్లో బెస్ట్ ఫీల్డర్ ఎవరనే ప్రశ్నకి.. రవీంద్ర జడేజా అని సమాధానమిచ్చాడు టామ్ మూడీ. జడేజాను మించిన అద్భుత ఫీల్డర్ ప్రస్తుతం ఎవరూ లేరన్నాడు. అతడు మైదానంలో అత్యంత వేగంగా కదులుతాడన్నాడు. ఫేవరెట్ క్రికెటర్ ఎవరు అని ప్రశ్నించగా.. విరాట్ కోహ్లీని ఎంచుకున్నాడు. అత్యుత్తమ కెప్టెన్గా మహేంద్రసింగ్ ధోనీకి ఓటేశాడు. ఆస్ట్రేలియాకు రెండు సార్లు ప్రపంచకప్ అందించిన రికీ పాంటింగ్లు ఉన్నప్పటికీ.. ధోనీకే ఓటేశాడు.
భారత్ తరఫున ఇప్పటి వరకూ 108 టీ20 మ్యాచ్లాడిన రోహిత్ శర్మ.. 138.79 స్ట్రైక్రేట్తో 2,773 పరుగులు చేశాడు. ఇందులో 4 సెంచరీలు, 21 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. ఇక ఆస్ట్రేలియా తరఫున 79 మ్యాచ్లాడిన డేవిడ్ వార్నర్.. 140.48 స్ట్రైక్రేట్తో 2,207 పరుగులు చేశాడు. ఇందులో ఒక శతకం, 17 అర్ధశతకాలు ఉన్నాయి. ఈ గణాంకాలు చూస్తే.. వార్నర్ కంటే రోహిత్ విధ్వంసక ఓపెనర్ అని తెలుస్తోంది. సన్రైజర్స్ హైదరాబాద్ జట్టుకి టామ్ మూడీ కోచ్ అన్న విషయం తెలిసిందే. వార్నర్ హైదరాబాద్ తరఫున ఆడుతున్నాడు.