'జడేజాను ఎందుకు పరీక్షించలేదు:
రవీంద్ర జడేజాకు బదులు యుజ్వేంద్ర చహల్ను కంకషన్ సబ్స్టిట్యూట్గా తీసుకోవడంపై క్రికెట్ వర్గాల్లో వివాదం నెలకొంది. కంకషన్ నిబంధనలకు కట్టుబడే భారత్ వ్యవహరించిందని పలువురు మాజీలు పేర్కొంటుండగా.. మరికొందరు దాన్ని వ్యతిరేకిస్తున్నారు. నిబంధనల ప్రకారం హెల్మెట్కు బంతి తాకిన వెంటనే సదరు ఆటగాణ్ని చెక్ చేయాల్సి ఉంటుంది. కానీ జడేజా హ్యామ్ స్ట్రింగ్ ఇంజ్యూరీ బారిన పడినప్పుడే ఫిజియో వచ్చి పరీక్షించి వెళ్లాడు. ఇదే విషయాన్ని సన్రైజర్స్ హైదరాబాద్ మాజీ కోచ్ టామ్ మూడీ ప్రస్తావించాడు. హెల్మెట్కు బంతి తాకినప్పుడు జడేజాను పరీక్షించడానికి డాక్టర్ ఎందుకు రాలేదని ప్రశ్నించాడు. అది ప్రోటోకాల్ కదా అని గుర్తు చేశాడు.
కంకషన్ సబ్స్టిట్యూట్ లొసుగును వాడుకుంది:
'జడేజా స్థానంలో చహల్ సబ్స్టిట్యూట్గా రావడంపై నాకెలాంటి అభ్యంతరం లేదు. కాని జడేజా హెల్మెట్కు బంతి తగిలినప్పుడు వైద్యుడు, ఫిజియో మైదానంలోకి రాకపోవడం నిబంధనల్ని పాటించినట్లే అవుతుందా?' అని టామ్ మూడీ ప్రశ్నించాడు. 'జడేజాకు కంకషన్ సబ్స్టిట్యూట్ అవసరమనడానికి వైద్యుడు లేదా ఫిజయో మైదానంలో అతడిని పరీక్షించలేదు. అంతకుముందు జడేజా కాలికి సంబంధించి ఏదో చేయించుకున్నట్లు కనిపించింది. ఇన్నింగ్స్ అనంతరం కంకషన్ సబ్స్టిట్యూట్ను బరిలో దించారు' అని ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ మైఖేల్ వాన్ వ్యాఖ్యానించాడు. భారత్ కంకషన్ సబ్స్టిట్యూట్ లొసుగును వాడుకుందని పేర్కొన్నాడు.
హల్ను తీసుకోవడం సరైందే:
టీంఇండియా క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్ కూడా ఈ విషయంపై స్పందించాడు. 'ఈ మ్యాచ్ రిఫరీ డేవిడ్ బూన్ ఆస్ట్రేలియన్. అతడా జట్టుకు మాజీ ఆటగాడు కూడా. జడేజాకు బదులు చహల్ సబ్స్టిట్యూట్గా రావడాన్ని ఆయన స్వాగతించారు. ఇక చహల్ స్పెషలిస్టు స్పిన్నర్ అని వాదించొచ్చు. కానీ జడేజా సైతం బౌలింగ్ చేయగలడు కాబట్టి చహల్ను తీసుకోవడం సరైందే. మ్యాచ్ రిఫరీ కూడా దాన్ని అంగీకరించాక దాంట్లో తప్పుపట్టాల్సిన అవసరం లేదు' అని సన్నీ అన్నాడు.
మంజ్రేకర్, సెహ్వాగ్, ఓజాలు ఏమన్నారంటే:
'జడేజా తలకు బంతి తగిలిన సమయంలో ఫిజియో రాకపోవడం నిబంధనలకు విరుద్ధం. వైద్యులు అక్కడికి చేరుకొని బ్యాట్స్మన్ను పరిశీలించాలి. అతడికి ఎలా ఉందనే విషయాలు తెలుసుకోవాలి. కానీ జడేజా విషయంలో ఇదేం జరగలేదు. కాసేపట్లోనే అతడు తిరిగి బ్యాటింగ్ చేశాడు. ఒకవేళ వైద్యులు అతడిని పరిశీలించి ఉంటే టీమిండియాకు బాగుండేది. మ్యాచ్ రిఫరీ డేవిడ్ బూన్.. చహల్ను అంగీకరించక తప్పలేదు' అని సంజయ్ మంజ్రేకర్ అన్నాడు.
'తలకు గాయమైతే లక్షణాలు వెంటనే కనిపించవు. 24 గంటల తర్వాత కూడా దాని ప్రభావం ఉండొచ్చు. జడేజా డ్రెస్సింగ్ రూంలోకి వెళ్లాక తలపై వాపు కనిపించిందేమో. ఇంతకుముందు స్మిత్ తలకు బౌన్సర్ తాకితే.. అతడి స్థానంలో ఆస్ట్రేలియా లబుషేన్ను ఆడించింది' అని మాజీ డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ గుర్తుచేశాడు.
'కంకషన్ నిబంధనలకు లోబడే టీమ్ఇండియా ఆడింది. నిబంధనల ప్రకారం ఆడితే అది కచ్చితంగా ఆమోదించాల్సిన విషయమే' అని ప్రజ్ఞాన్ ఓజా పేర్కొన్నాడు.
టీమిండియాకి భారీ ఎదురుదెబ్బ.. టీ20 సిరీస్ నుంచి స్టార్ ఆల్రౌండర్ ఔట్!!