హైదరాబాద్: భారత్తో తొలి వన్డేలో ఓడినా.. ఈ మ్యాచ్ తమకు ఎంతో ప్రత్యేకమని న్యూజిలాండ్ కెప్టెన్ టామ్ లాథమ్ అన్నాడు. ఉప్పల్ మైదానం వేదికగా బుధవారం ఉత్కంఠగా సాగిన మ్యాచ్లో టీమిండియా 12 పరుగుల తేడాతో గట్టెక్కింది. ఈ మ్యాచ్ అనంతరం తమ ఓటమిపై స్పందించిన టామ్ లాథమ్.. తమ ఆల్రౌండర్ మైకేల్ బ్రేస్వెల్పై ప్రశంసల జల్లు కురిపించాడు. అతని అసాధారణ ఇన్నింగ్స్ ఫిదా అయ్యామని తెలిపాడు. ఈ మ్యాచ్లో ఓడినా అతను కనబర్చిన పోరాటం తమను ఆకట్టుకుందని చెప్పాడు.
'మైకేల్ బ్రేస్వెల్ అసాధారణ ఇన్నింగ్స్ ఆడాడు. 131 పరుగులకే 6 వికెట్లు కోల్పోయిన జట్టును తనదైన విధ్వంసకర బ్యాటింగ్తో విజయం ముంగిట నిలబెట్టాడు. ఇది అత్యద్భుతమైన ఇన్నింగ్స్. బ్రేస్వెల్ సూపర్ ఇన్నింగ్స్ తర్వాత కూడా గెలవకపోవడం నిరాశకు గురి చేసినా.. ఈ మ్యాచ్ మాకు ప్రత్యేకమే. చేజింగ్లో తీవ్ర ఒత్తిడి ఉన్న పరిస్థితుల్లో బ్యాటింగ్కు వచ్చి విజయవకాశాలు సృష్టించడం ఎవరికైనా స్పెషలే. అండర్ లైట్స్లో బంతి బాగా గ్రిప్ అయ్యింది. భారత బౌలర్లు కట్టర్స్తో వికెట్లు సాధించారు. బ్రేస్వెల్ మాత్రం అదరగొట్టాడు. సాంట్నర్తో కలిసి అసాధారణమైన భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు.'అని టామ్ లాథమ్ చెప్పుకొచ్చాడు.
న్యూజిలాండ్ ఆల్రౌండర్ మైకేల్ బ్రేస్వెల్(78 బంతుల్లో 12 ఫోర్లు, 10 సిక్స్లతో 140) విధ్వంసకర సెంచరీతో ఉక్కిరి బిక్కిరి చేశాడు. మిచెల్ సాంట్నర్తో కలిసి ఏడో వికెట్కు 162 పరుగులు జోడించాడు. ఈ బిగ్ పార్ట్నర్షిప్ను సిరాజ్ విడదీయడం.. చివర్లో హార్దిక్ పాండ్యా పొదుపుగా బౌలింగ్ చేయడంతో టీమిండియా ఓటమి నుంచి గట్టెక్కింది.
ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్లకు 349 పరుగులు చేసింది. శుభ్మన్ గిల్(149 బంతుల్లో 19 ఫోర్లు, 9 సిక్స్లతో 208) ఒక్కడే డబుల్ సెంచరీ బాదగా.. రోహిత్ శర్మ(34), సూర్యకుమార్ యాదవ్(31) రాణించారు.
న్యూజిలాండ్ బౌలర్లలో హెన్రీ షిప్లే, డారిల్ మిచెల్ రెండు వికెట్లు తీయగా.. లాకీ ఫెర్గూసన్, బ్లెయిర్ టిక్క్నర్, మిచెల్ సాంట్నర్ తలో వికెట్ తీసారు. అనంతరం లక్ష్యచేధనకు దిగిన న్యూజిలాండ్ 337 పరుగులకు కుప్పకూలింది. బ్రేస్ వెల్కు తోడుగా మిచెల్ సాంట్నర్(57) రాణించాడు. భారత బౌలర్లలో సిరాజ్కు తోడుగా కుల్దీప్ యాదవ్, శార్దూల్ ఠాకూర్ రెండేసి వికెట్లు పడగొట్టారు. షమీ, హార్దిక్ పాండ్యాకు తలో వికెట్ దక్కింది.