వెల్లింగ్టన్: న్యూజిలాండ్ స్టార్ పేసర్ టీమ్ సౌథీ తన పెద్ద మనసును చాటుకున్నాడు. క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్న ఓ 8 ఏళ్ల చిన్నారికి సాయం చేసేందుకు ఈ కివీస్ పేసర్ ముందుకొచ్చాడు. ఇప్పటికే పలుమార్లు తనకు తోచిన సాయం చేసిన టీమ్ సౌథీ.. తాజాగా డబ్ల్యూటీసీ ఫైనల్లో ధరించిన జెర్సీల్లో ఒకదానిని వేలానికి పెట్టాడు. ఆ వచ్చిన డబ్బును సదరు చిన్నారి వైద్యానికి ఖర్చు చేయనున్నాడు. ప్రతిష్టాత్మక వరల్డ్ టెస్ట్ చాంపియన్షిప్ ఫైనల్ మ్యాచ్ రెండో ఇన్నింగ్స్లో సౌథీ 4 వికెట్లు తీసి భారత్ పతనాన్ని శాసించిన విషయం తెలిసిందే. అప్పుడు ధరించిన జెర్సీపైనే తన సహచర ఆటగాళ్లతో సంతకాలు చేయించి వేలంలో పెట్టాడు.
న్యూరోబ్లాస్టోమా అనే అరుదైన క్యాన్సర్తో బాధపడుతున్న హోలీ బీటీ అనే అమ్మాయికి సాయం చేసేందుకే ఈ జెర్నీని వేలంలో పెడుతున్నట్లు సౌథీ చెప్పుకొచ్చాడు. 'హోలీ బీటీకి జరుగుతున్న ట్రీట్మెంట్కు సాయం చేయాలనే ఉద్దేశంతో భారత్తో జరిగిన డబ్ల్యూటీసీ ఫైనల్లో నేను ధరించిన ఓ జెర్సీని వేలానికి పెడుతున్నాను. దీనిపై న్యూజిలాండ్ టీమ్ ఆటగాళ్లంతా సంతకాలు చేశారు. కొన్నేళ్ల క్రితం హోలీ దీన పరిస్థితి గురించి నా ఫ్యామిలీ ద్వారా తెలిసింది.
అప్పటి నుంచి ఆ చిన్నారికి, వారి కుటుంబ సభ్యులకు తోచిన సాయం చేయడంతో పాటు సానూకూల ధృక్పథంతో పోరాడే ధైర్యాన్ని అందించాం. అయితే హోలీకి మెరుగైన చికిత్స అందించాలని తెలిసింది. దాంతో ఈ జెర్సీ వేలం ద్వారా వారికి కావాల్సిన సాయం అందజేయవచ్చని భావించా. ఆ నమ్మకం నాకుంది'అని సౌథీ పేర్కొన్నాడు. ఈ వేలానికి జులై 8 వరకూ బిడ్లు దాఖలు చేయవచ్చు. మంగళవారం ఉదయం వరకూ 152 బిడ్లు దాఖలు కాగా.. అత్యధికంగా 7 వేల డాలర్ల బిడ్ వచ్చింది. ఇక ప్రతిష్టాత్మక ఫైనల్ మ్యాచ్లో భారత్ 8 వికెట్ల తేడాతో ఓడిన విషయం తెలిసిందే.