కోహ్లీ క్లీన్ బోల్డ్:
శనివారం ఆక్లాండ్ వేదికగా న్యూజిలాండ్తో జరిగిన రెండో వన్డేలో విరాట్ కోహ్లీ (15) ఎక్కువ సేపు క్రీజ్లో నిలబడలేకపోయాడు. సౌతీ వేసిన 10 ఓవర్ నాలుగో బంతికి క్లీన్బౌల్డ్ అయ్యాడు. ఫుల్ లెంగ్త్ బాల్ను ఆన్సైడ్లో ఫ్లిక్ చేద్దామని కోహ్లీ ప్రయత్నించగా.. బంతి బ్యాట్ ఎడ్జ్ తీసుకుని వికెట్లను గిరటేయడంతో భారత కెప్టెన్ భారంగా నిష్క్రమించాడు. సాధారణంగా ఇటువంటి షాట్లు కొట్టడంలో ఎక్కువగా ఫెయిల్ కానీ కోహ్లీ.. ఈసారి అంచనా తప్పాడు.
ఎక్కువసార్లు సౌతీకే వికెట్:
తాజాగా ఔట్తో అన్ని ఫార్మాట్లలో కలిపి టీమ్ సౌతీకే విరాట్ కోహ్లీ ఎక్కువ సార్లు వికెట్ను సమర్పించుకున్నాడు. అన్ని ఫార్మాట్లలో కలిపి కోహ్లీని సౌతీ 9సార్లు ఔట్ చేసాడు. జేమ్స్ అండర్సన్, గ్రేమ్ స్వాన్లు తలో 8సార్లు కోహ్లీని ఔట్ చేశారు. ఇక ఆడమ్ జంపా, రవి రాంపాల్, మోర్నీ మోర్కెల్లు ఏడేసి సార్లు కోహ్లీని పెవిలియన్కు పంపారు. కోహ్లీని ఎక్కువసార్లు ఔట్ చేసిన ఘనత మాత్రం సౌతీకే దక్కింది.
సౌతీ సిక్సర్:
వన్డే ఫార్మాట్లో కోహ్లీని ఎక్కువ సార్లు ఔట్ చేసిన జాబితాలో రాంపాల్తో కలిసి సౌతీ సంయుక్తంగా అగ్ర స్థానంలో ఉన్నాడు. ఈ ఫార్మాట్లో ఆరు సార్లు సౌతీకే కోహ్లీ ఔట్ కాగా.. అంతకుముందు రాంపాల్కు కూడా అన్నేసార్లు వికెట్ను సమర్పించుకున్నాడు. ఈ జాబితాలో శ్రీలంక బౌలర్ తిషారా పెరీరా, జంపాలు ఐదేసి సార్లు ఔట్ చేసి సంయుక్తంగా రెండో స్థానంలో ఉన్నారు. జాసన్ హోల్డర్, సూరజ్ రాండివ్, స్వాన్, రిచర్డ్సన్ తలో నాలుగు సార్లు ఔట్ చేసారు.
టీమిండియా ఓటమి:
రెండో వన్డేలో టీమిండియా పోరాడి ఓడిపోయింది. న్యూజిలాండ్ నిర్దేశించిన 274 పరుగుల లక్ష్య ఛేదనలో భారత్ 48.3 ఓవర్లలో 251 పరుగులకు ఆలౌట్ అయి 22 పరుగుల తేడాతో ఓడిపోయింది. ఉత్కంఠగా జరిగిన ఈ మ్యాచ్లో రవీంద్ర జడేజా (55), నవదీప్ సైనీ (45) గెలుపుపై ఆశలు రేపినా.. చివరి వరకూ ఆ జోరును కొనసాగించలేకపోయారు. దీంతో జడేజా, సైనీ పోరాటం వృధా అయింది. ఈ విజయంతో మూడు వన్డేల సిరీస్ను న్యూజిలాండ్ 2-0తో మరో మ్యాచ్ మిగులుండగానే కైవసం చేసుకుంది.