సచిన్ మాత్రమే:
కరోనా వైరస్ కారణంగా ఏర్పడిన లాక్డౌన్ నేపథ్యంలో ఇళ్లకే పరిమితమైపోయిన క్రికెటర్లు తమ ఫ్యాన్స్తో టచ్లో ఉండేందుకు సోషల్ మీడియాను వినియోగించుకుంటున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో తిలకరత్నె దిల్షాన్ ఆల్ టైం బెస్ట్ వన్డే జట్టును ప్రకటించాడు. అయితే దిల్షాన్ తన జట్టులో ఒక్క భారత ఆటగాడికి మాత్రమే చోటు ఇచ్చాడు. ఆ ఒక్కడు మరెవరో కాదు.. క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్.
ముగ్గురు లంక ఆటగాళ్లకు చోటు:
తిలకరత్నె దిల్షాన్ తన ఆల్ టైం బెస్ట్ వన్డే జట్టులో ముగ్గురు లంక ఆటగాళ్లకు చోటిచ్చాడు. వెస్టిండీస్, ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికాల నుంచి ఇద్దరు చొప్పున ఎంచుకున్న దిల్షాన్.. భారత్, పాకిస్తాన్ల నుంచి ఒక్కొక్కరికి మాత్రమే చోటిచ్చాడు. సనత్ జయసూర్య, సచిన్ టెండూల్కర్లను ఓపెనింగ్ బ్యాట్స్మెన్లుగా దిల్షాన్ ఎంచుకున్నాడు. జయసూర్యలా విధ్వంసక ఓపెనింగ్ చేయగల ఆటగాడు మరోకరు లేరన్నాడు. అదే సచిన్ విషయానికి వస్తే అతడు మరింత క్లాసికల్గా ఆడతాడు, ఆటను ముందుకు నడిపిస్తాడని పేర్కొన్నాడు.
మూడో స్థానంలో లారా:
మూడో స్థానంలో విండీస్ దిగ్గజం బ్రయాన్ లారాను దిల్షాన్ ఎంచుకున్నాడు. జట్టు క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నప్పుడు లారా ఆదుకోగల నేర్పరని తెలిపాడు. నాలుగో స్థానంలో మహేళ జయవర్దనే కంటే బాగా ఆడే మరో ఆటగాడు లేడని లంక మాజీ ఓపెనర్ అభిప్రాయపడ్డాడు. ఐదో స్థానంలో రికీ పాంటింగ్, ఆరో స్థానంలో జాక్వస్ కల్లిస్, ఏడో స్థానంలో ఏబీ డివిలియర్స్లకు అవకాశం ఇచ్చాడు.
పేసర్ల జాబితాలో అక్రమ్, వాల్ష్:
పేసర్ల జాబితాలో పాక్ లెజెండ్ వసీం అక్రమ్, వెస్టిండీస్ దిగ్గజం కర్ట్నీ వాల్ష్లను దిల్షాన్ ఆల్ టైం బెస్ట్ వన్డే జట్టులో తీసుకున్నాడు. స్పిన్ విభాగంలో ముత్తయ మురళీధరణ్, షేన్ వార్న్లకు చోటిచ్చాడు. ఇక రికీ పాంటింగ్కు కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించాడు. అయితే దిల్షాన్ తన జట్టులో తనకే చోటివ్వకపోవడం విశేషం.
దిల్షాన్ ఆల్ టైం బెస్ట్ వన్డే జట్టు:
సనత్ జయసూర్య, సచిన్ టెండూల్కర్, బ్రయాన్ లారా, మహేళ జయవర్దనే, రికీ పాంటింగ్, జాక్వస్ కల్లిస్, ఏబీ డివిలియర్స్, వసీం అక్రం, కర్ట్నీ వాల్ష్, ముత్తయ మురళీధరణ్, షేన్ వార్న్.