శిఖర్ ధవన్
కివీస్తో వన్డే సిరీస్లో టీమిండియా సారధిగా ఉన్న శిఖర్ ధవన్కు ఈ సిరీస్ కీలకం కానుంది. కేవలం వన్డే ఫార్మాట్లో మాత్రమే ఆడుతున్న అతను పెద్దగా రాణించలేదు. ఈ ఏడాది 16 వన్డే మ్యాచులు ఆడిన అతను.. 40.50 సగటుతో 567 పరుగులు చేశాడు. అతని సగటు బాగానే ఉన్నా.. స్ట్రైక్ రేట్ 74.60 అద్భుతంగా లేదు. దానికితోడు క్రీజులో ధవన్ తడబాటు చాలా స్పష్టంగా కనిపిస్తోంది. అదే సమయంలో శుభ్మన్ గిల్ అద్భుతమై ఫామ్తో టీమిండియాలోకి దూసుకొచ్చాడు. ఇటీవలి కాలంలో ఇచ్చిన ప్రతి అవకాశాన్నీ సద్వినియోగం చేసుకున్నాడు. ఈ క్రమంలో ధవన్ ఏమాత్రం తడబడినా అతని స్థానాన్ని గిల్ కొట్టేయడం ఖాయంగా కనిపిస్తోంది.
యుజ్వేంద్ర చాహల్
సుమారు రెండేళ్లుగా అంతంత మాత్రమే రాణిస్తున్న స్టార్ స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్. కివీస్తో టీ20 సిరీస్లో కూడా అతను పెద్దగా ఆకట్టుకోలేదు. అయితే ఈ ఏడాది వన్డే ఫార్మాట్లో అతను ఫర్వాలేదనిపించాడు. మొత్తం ఆడిన 11 మ్యాచుల్లో 21 వికెట్లు తీసుకున్నాడు. అయితే మరో స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ పునరాగమనంలో అదరగొడుతున్నాడు. ఇప్పటి వరకు ఈ ఏడాదిలో ఆడిన 7 వన్డేల్ల 11 వికెట్లు తీసుకున్న అతని ఎకానమీ చాలా తక్కువగా ఉంది. కుల్దీప్ నుంచి పోటీ తట్టుకొని వన్డే వరల్డ్ కప్లో టీమిండియాలో స్థానం పొందాలంటే చాహల్ తప్పనిసరిగా ఈ సిరీస్లో రాణించాలి. ఎందుకంటే బంగ్లా పర్యటనకు వీళ్లిద్దరినీ ఎంపిక చేయలేదు.
శ్రేయాస్ అయ్యర్
పొట్టి ఫార్మాట్లో ఘోరంగా విఫలం అవుతున్న శ్రేయాస్ అయ్యర్.. వన్డే ఫార్మాట్లో మాత్రం సత్తా చాటుతున్నాడు. ఈ ఏడాది అతను ఆడిన వన్డేల్లో 60.75 సగటుతో పరుగులు చేశాడు. దానికితోడు న్యూజిల్యాండ్లో అతని రికార్డు కూడా బాగానే ఉంది. 2020లో ఇక్కడ జరిగిన మూడు వన్డేల సిరీస్లో తొలి అంతర్జాతీయ శతకంతోపాటు 217 పరుగులు చేశాడు. అయితే మిడిలార్డర్లో కేఎల్ రాహుల్, రిషభ్ పంత్ రాణిస్తుండటంతో శ్రేయాస్కు చోటు దక్కడం ప్రశ్నార్థకంగా మారింది. కానీ కివీస్ టూర్లో రాణిస్తే.. తన బ్యాటుతో గట్టి వాదన వినిపించినట్లే.