బ్యాటింగ్ కష్టాలు..
ఇషాన్ కిషన్, రోహిత్ శర్మ ఇద్దరూ కలిసి ఏ జట్టుకైనా ఓపెనింగ్ అందిస్తే కచ్చితంగా బౌలర్లపై ఎదురుదాడికి దిగుతారని అంతా అనుకుంటారు. కానీ గతేడాది వీళ్లిద్దరూ పవర్ప్లేలో అతి జాగ్రత్తలకు పోయి జట్టుకు శుభారంభాలు అందించడంలో విఫలమయ్యారు. దీనికితోడు మిడిలార్డర్లో అనుభవం లేని తిలక్ వర్మ, డెవాల్డ్ బ్రెవిస్, టిమ్ డేవిడ్ వంటి ఆటగాళ్లు ప్రతిసారీ జట్టును గెలిపించలేరు కదా. గతేడాది ముంబై జట్టు ఆ సీజన్లోనే అత్యంత తక్కువ బౌండరీలు బాదింది. పవర్ప్లేలో ఈ జట్టు స్ట్రైక్ రేటు 116 మాత్రమే. మిగతా జట్లతో పోలిస్తే ఇది చాలా తక్కువ. అదే సమయంలో సగటున 15.1 బంతులకు ఒక వికెట్ కోల్పోతూ వచ్చింది. ఈ కష్టాలకు ముంబై యాజమాన్యం సమాధానాలు వెతకలేదు. మరి ఈ ఏడాది వీళ్లు ఏం చేస్తారో చూడాలి.
క్వాలిటీ స్పిన్నర్ కరువు
ముంబై ఇండియన్స్ ఎప్పుడూ కూడా స్పిన్నర్ల కోసం భారీగా ఖర్చు చేయలేదు. దేశవాళీ స్పిన్నర్లతోనే పని కానిచ్చేది. గతేడాది కూడా ఇదే పని చేసింది. మయాంక్ మార్కండే, మురుగన్ అశ్విన్ను జట్టులోకి తీసుకుంది. వీళ్లు మిడిల్ ఓవర్లలో పరుగులు కట్టడి చేయడంలో పెద్దగా సక్సెస్ కాలేదు. దానికితోడు వికెట్లు కూడా తీసుకోలేకపోయారు. ఈ ప్రభావం మ్యాచ్పై చాలా ఎక్కువగా పడింది. మధ్య ఓవర్లలో వారికి అండగా నిలిచే బౌలర్ కూడా జట్టులో లేకపోవడం దెబ్బకొట్టింది. అయితే మినీ వేలంలో భారీ ధరకు కొనుగోలు చేసిన ఆసీస్ యువ ఆల్రౌండర్ కామెరూన్ గ్రీన్ ఈ సమస్యకు పరిష్కారం చూపిస్తాడని ముంబై భావిస్తోంది. మరి అతను ఏం చేస్తాడో.
డెత్ ఓవర్ల సమస్య
ముంబై ఎప్పుడూ తమ బౌలింగ్ యూనిట్పై బాగానే ఖర్చు చేసేది. ఒకప్పుడు జస్ప్రీత్ బుమ్రా, మిచెల్ జాన్సన్, లసిత్ మలింగ.. వీళ్లు ముగ్గురూ ఆ జట్టు బౌలింగ్ యూనిట్ను ముందుండి నడిపించేవారు. ముఖ్యంగా డెత్ ఓవర్లలో ప్రత్యర్థులకు కొరకరాని కొయ్యలా మారారు. కానీ ప్రస్తుతం ఆ జట్టులో బుమ్రా తప్ప మరో డెత్ ఓవర్ స్పెషలిస్టు కనిపించలేదు. భారీ ధరకు కొనుగోలు చేసిన జోఫ్రా ఆర్చర్ గాయంతో గతేడాది ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదు. ఈసారి అతను పునరాగమనం చేయడంతో బుమ్రాకు డెత్ ఓవర్లలో మంచి సహకారం లభిస్తుందని అభిమానులు ఆశిస్తున్నారు. వీళ్లిద్దరూ కలిసి డెత్ ఓవర్ల సమస్యకు పరిష్కారం చూపితే ముంబై ఒడ్డున పడినట్లే.