2017, మార్చి4వ తేదీన
2017, మార్చి4 వ తేదీన బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో రెండో టెస్టు మ్యాచ్ ఆరంభమైంది. రెండో ఇన్నింగ్స్లో 188 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన ఆస్ట్రేలియా నాలుగో రోజు 73 పరుగులకే 3 వికెట్లు కోల్పోయింది. అప్పుడు క్రీజులో స్టీవ్ స్మిత్, పీటర్ హ్యాండ్స్ కోంబ్ ఉన్నారు. ఉమేశ్ యాదవ్ వేసిన బంతి స్టీవ్ స్మిత్ ప్యాడ్స్ను తాకింది.
స్మిత్ను ఎల్బీగా ప్రకటించిన అంఫైర్
దీంతో వెంటనే ఉమేశ్ యాదవ్ ఎల్బీగా అప్పీల్ చేశాడు. దీంతో అంపైర్ నైజెల్ లాంగ్ ఎల్బీడబ్ల్యూగా ప్రకటించారు. ఫీల్డ్ అంపైర్ నిర్ణయంపై డీఆర్ఎస్కు వెళ్లాలని భావించిన స్మిత్ ముందుగా సహచరుడు హ్యాండ్స్కోంబ్తో చర్చించాడు. అయితే అతడు ఏ విషయం స్పష్టంగా చెప్పకపోవడంతో ఏంటి అన్నట్లుగా చేతులతో డ్రెస్సింగ్ రూమ్ వైపు సైగ చేశాడు.
అంపైర్కు ఫిర్యాదు చేసిన కోహ్లీ
దీనిని గుర్తించిన టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ వెంటనే దూసుకొచ్చి అలా ఎలా చేస్తావంటూ స్మిత్తో మైదానంలోనే గొడవపడ్డాడు. దీనిపై అంఫైర్కు ఫిర్యాదు కూడా చేశాడు. అప్పటికే స్మిత్ను హెచ్చరించిన అంపైర్, కోహ్లీని కూడా పక్కకు తీసుకెళ్లి సర్ధి చెప్పాడు. అయితే, కోహ్లీ హడావుడిని చూసిన స్మిత్ చివరకు రివ్యూ కోరకుండా నిష్క్రమించాడు.
అప్పట్లో పెను దుమారం
ఆ తర్వాత దీనిపై పెద్ద దుమారమే చెలరేగింది. నిబంధనల ప్రకారం క్రీజులో ఉన్న ప్లేయర్ డీఆర్ఎస్ విషయంలో మైదానంలో అవతలి ఎండ్లో ఉన్న బ్యాట్స్మన్ సాయం మాత్రమే తీసుకోవాలి. దీంతో మ్యాచ్ అనంతరం మీడియా సమావేశంలో స్టీవ్ స్మిత్ను మోసగాడంటూ కోహ్లీ విమర్శించాడు. అయితే, తనుక బుర్ర పనిచేయకపోవడం వల్లే అలా చేశానంటూ స్మిత్ ఆ తర్వాత పెద్ద వివరణే ఇచ్చుకున్నాడు.
స్మిత్ తీరుని తప్పుబట్టిన యావత్ ప్రపంచం
ఈ టెస్టులో స్మిత్ తీరుని యావత్ ప్రపంచం తప్పుబట్టింది. ఆ మ్యాచ్లో ఆసీస్ విజయానికి 188 పరుగులు అవసరం కాగా, ఆ జట్టు తన రెండో ఇన్నింగ్స్లో 112 పరుగులకే ఆలౌటైంది. దీంతో భారత్ 75 పరుగుల తేడాతో విజయం సాధించింది. దీంతో నాలుగు టెస్టు మ్యాచ్ల సిరిస్లో 1-1తో సమం అయింది.
2-1తో సిరిస్ను కైవసం చేసుకున్న కోహ్లీసేన
అంతకముందు పూణె వేదికగా జరిగిన తొలి టెస్టులో ఆస్ట్రేలియా 333 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ టెస్టు తొలి ఇన్నింగ్స్లో స్టీవ్ స్మిత్ సెంచరీతో చెలరేగాడు. ఇక మూడో టెస్టు డ్రాగా ముగియగా, నాలుగో టెస్టులో భారత్ 8 వికెట్ల తేడాతో విజయం సాధించింది. దీంతో నాలుగు టెస్టుల సిరీస్ను భారత్ 2-1తో కైవసం చేసుకుంది.