
కుంబ్లే రికార్డుకు 21 ఏళ్లు:
కుంబ్లే రికార్డుకి 21 ఏళ్ల సందర్భంగా ఐసీసీ ఈ చారిత్రక రోజుని గుర్తు చేస్తూ ఓ ట్వీట్ చేసింది. '26.3-9-74-10. ఒక టెస్టు ఇన్నింగ్స్లో పది వికెట్లు తీసిన రెండో బౌలర్ అనిల్ కుంబ్లే' అని ట్వీటింది. ప్రస్తుతం ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అయింది. భారత అభిమానులు విషెష్ తెలుపుతున్నారు. లైకులు, కామెంట్లు చేస్తూ ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

రెండో బౌలర్గా రికార్డు:
1999 ఫిబ్రవరిలో పాకిస్థాన్పై అనిల్ కుంబ్లే అంతర్జాతీయ టెస్ట్ల్లో ఒకే ఇన్నింగ్స్లో 10 వికెట్లు పడగొట్టిట్టారు. దీంతో ఒకే ఇన్నింగ్స్లో 10 వికెట్లు పడగొట్టిన రెండో బౌలర్గా రికార్డు సృష్టించారు. అయితే తొలిసారి ఈ ఘనత అందుకున్నది మాత్రం ఇంగ్లండ్ మాజీ బౌలర్ జిమ్ లేకర్. 1956లో ఆస్ట్రేలియాతో జరిగిన టెస్ట్ మ్యాచ్లో లేకర్ ఒకే ఇన్నింగ్స్లో 10 వికెట్లు తీసిన తొలి బౌలర్గా నిలిచారు. లేకర్ 1946 నుంచి 1959లో ఇంగ్లండ్ జట్టుకు ప్రాతినిథ్యం వహించారు. 46 మ్యాచ్లు ఆడిన జిమ్ 193 వికెట్లు పడగొట్టారు.

సిరీస్ను కాపాడుకోవాలంటే:
కార్గిల్ యుద్ధానికి ముందు 1999 ఫిబ్రవరిలో భారత పర్యటనకు దాయాది పాకిస్థాన్ వచ్చింది. రెండు టెస్టుల సిరీస్లో చెన్నె వేదికగా జరిగిన తొలి మ్యాచ్లో భారత్ 12 పరుగుల తేడాతో ఓడిపోయింది. దీంతో సిరీస్ను కాపాడుకోవాలంటే.. ఢిల్లీ వేదికగా జరగాల్సిన రెండో టెస్టులో భారత్ తప్పక గెలవాల్సిన పరిస్థితి వచ్చింది. రెండో టెస్టులో మొదట బ్యాటింగ్ చేసిన భారత్ తొలి ఇన్నింగ్స్లో 252 పరుగులు చేసింది. తర్వాత బ్యాటింగ్కు దిగిన పాక్.. కుంబ్లే (4/75), హర్భజన్ (3/30) ధాటికి 172 పరుగులకే ఆలౌట్ అయింది.

ఒకే ఇన్నింగ్స్లో 10 వికెట్లు:
అనంతరం 80 పరుగుల ఆధిక్యంతో రెండో ఇన్నింగ్స్ను ఆరంభించిన టీమిండియా 339 పరుగులు చేసి.. పాక్ ముందు 420 పరుగుల భారీ లక్ష్యాన్ని ఉంచింది. భారీ లక్ష ఛేదనలో కుంబ్లే (10/74) దాటికి 207 పరుగులకే పాక్ చాపచుట్టేసింది. పాక్ బ్యాట్స్మెన్ అందర్నీ వరుసగా పెవిలియన్కు పంపిస్తూ కుంబ్లే ఒకే ఇన్నింగ్స్లో పది వికెట్లు పడగొట్టి రికార్డు సృష్టించారు. సుదీర్ఘ ఫార్మాట్లో జంబో తర్వాత ఇప్పటివరకు మారెవరూ పది వికెట్లు తీయలేదు.
పంజాబ్కు కోచ్గా:
అంతర్జాతీయ క్రికెట్లో జిమ్ లేకర్, అనిల్ కుంబ్లే మాత్రమే ఒకే ఇన్నింగ్స్లో పది వికెట్లు పడగొట్టి రికార్డు సృష్టించారు. డొమెస్టిక్ క్రికెట్లో మాత్రం రెక్స్ రాజ్సింగ్, దేబాషిష్ మొహాంతీ, నిర్దేశ్ బైసోలాలు ఈ ఫీట్ను అందుకున్నారు. కుంబ్లే భారత్ తరఫున 132 టెస్టులు, 271 వన్డేలు ఆడారు. ప్రస్తుతం కుంబ్లే ఐపీఎల్ జట్టు కింగ్స్ ఎలెవన్ పంజాబ్కు కోచ్గా ఉన్నారు.


Click it and Unblock the Notifications












