విండిస్ సిరిస్లో సెంచరీతో చెలరేగిన పృథ్వీ షా
వెస్టిండిస్తో జరిగిన రెండు టెస్టు మ్యాచ్ల సిరిస్లో ఓపెనర్ పృథ్వీ షా (134, 70, 33 నాటౌట్) సెంచరీతో టాప్ స్కోరర్గా నిలిచి మ్యాన్ ఆఫ్ ద సిరిస్ అవార్డుని సైతం గెలుచుకుని టెస్టు జట్టులో తన స్థానాన్ని పదిలం చేసుకున్నాడు. మరో ఓపెనర్ కేఎల్ రాహుల్ (0, 4, 33 నాటౌట్) నిరాశపరిచాడు.
మూడో ఓపెనర్పై ఆలోచన
దీంతో సెలక్టర్లు ఇప్పుడు మూడో ఓపెనర్పై ఆలోచన చేయాల్సి వస్తోంది. ఇంగ్లాండ్ గడ్డపై నిరాశపరిచిన మురళీ విజయ్, శిఖర్ ధావన్లపై వెస్టిండిస్తో ముగిసిన రెండు టెస్టు మ్యాచ్ల సిరిస్లో సెలక్టర్లు వేటు వేశారు. వీరి స్థానంలో పృథ్వీ షా, మయాంక్ అగర్వాల్కి అవకాశం ఇవ్వాలని జట్టు మేనేజ్మెంట్ యోచించింది.
మయాంక్ అగర్వాల్ రాణిస్తాడా? అనే సందేహం
అయితే, ఆ దిశగా మేనేజ్మెంట్ అడుగులు వేయలేదు. దేశవాళీ మ్యాచ్లో ఆడినట్లు అంతర్జాతీయ స్థాయిలో మయాంక్ అగర్వాల్ రాణిస్తాడా? అనే సందేహం నెలకొంది. ఈ నేపథ్యంలో మయాంక్ అగర్వాల్కు చోటు దక్కుతుందా? లేదా ఆనేది ఆసక్తికరంగా మారింది. మరోవైపు విండిస్తో జరిగిన రెండు టెస్టుల్లోనూ 92, 92 పరుగులతో రిషబ్ పంత్ సత్తా చాటాడు.
ఆసీస్తో టెస్టు సిరీస్కి పంత్ ఎంపిక లాంఛనమే
వికెట్ కీపర్గా కూడా మంచి మార్కులు కొట్టేశాడు. దీంతో ఆసీస్తో టెస్టు సిరీస్కి అతడి ఎంపిక లాంఛనంగా కనిపిస్తోంది. ఆసీస్తో నాలుగు టెస్టు మ్యాచ్ల సిరిస్ కావడం... ఈ సిరిస్ మధ్యలో అతను గాయపడితే? ప్రత్యామ్నాయ కీపర్ అందుబాటులో ఉండాలి. కాబట్టి.. దినేశ్ కార్తీక్ని ఎంపిక చేయాలని సెలక్టర్లు యోచిస్తున్నారు.
మూడో ఓపెనర్, రెండో వికెట్ కీపర్ కోసం అన్వేషణ
ఇటీవలే ఇంగ్లాండ్లో సర్జరీ చేయించుకుని ఫిట్నెస్ సాధించేందుకు ప్రయత్నిస్తోన్న సీనియర్ వికెట్ కీపర్ వృద్ధిమాన్ సాహా పేరు పరిశీలనలో ఉన్నప్పటికీ అతడికి జట్టులో చోటు దక్కడం కష్టమే. దీంతో ఆస్ట్రేలియాతో నాలుగు టెస్టు మ్యాచ్ల సిరీస్ కోసం జట్టుని ప్రకటించేందుకు సెలక్టర్లు మూడో ఓపెనర్, రెండో వికెట్ కీపర్ కోసం అన్వేషణ మొదలుపెట్టారు.