
బంగ్లాదేశ్తో జరిగిన రెండో వన్డేలో భారత్కు గట్టి ఎదురు దెబ్బ తగిలింది. ఈ మ్యాచ్ రెండో ఓవర్లో స్లిప్స్లో ఫీల్డింగ్ చేస్తున్న టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మకు గాయమైంది. క్యాచ్ అందుకునేందుకు ప్రయత్నించిన రోహిత్ బొటన వేలి ఎముకకు దెబ్బ తగిలింది. ఎముక డిస్లొకేట్ అయిందని, అక్కడ కుట్ట పడ్డాయని మ్యాచ్ అనంతరం రోహిత్ శర్మ తెలిపాడు. రోహిత్తోపాటు ఫాస్ట్ బౌలింగ్ ఆల్రౌండర్ దీపక్ చాహర్కు కూడా గాయమైంది. వీళ్లిద్దరూ భారత్ తరఫున బ్యాటింగ్ చేశారు కానీ.. మూడో వన్డేలో వీళ్లు ఆడటంపై అనుమానాలు ఏర్పడ్డాయి.
మ్యాచ్ అనంతరం ఈ విషయంపై టీమిండియా కోచ్ రాహుల్ ద్రావిడ్ స్పష్టతనిచ్చాడు. రోహిత్ గాయాన్ని సీరియస్గా తీసుకున్నామన్న అతను.. మూడో వన్డేలో రోహిత్ ఆడటం లేదని స్పష్టం చేశాడు. అతను వెంటనే ముంబై వెళ్తాడని, అక్కడ అతని గాయానికి చికిత్స జరుగుతుందని వివరించాడు. ఆ తర్వాత జరిగే టెస్టు సిరీస్లో అయినా రోహిత్ ఆడతాడో లేదో ఇప్పుడే చెప్పలేమన్నాడు. గాయం తీవ్రతను బట్టి ఈ నిర్ణయం తీసుకుంటామని, తను ఇప్పుడే ఏ నిర్ణయం తీసుకోలేనని వెల్లడించాడు.
అలాగే రెండో వన్డేలో గాయపడిన దీపక్ చాహర్ కూడా మూడో వన్డేకు అందుబాటులో ఉండటం లేదని ద్రావిద్ తెలిపాడు. తొలి వన్డేలో అరంగేట్రం చేసిన కుల్దీప్ సేన్ కూడా గాయం కారణంగా జట్టుకు దూరమైన సంగతి తెలిసిందే. ఈ ముగ్గురూ కూడా మూడో వన్డేలో ఆడటం లేదని ద్రావిడ్ కన్ఫర్మ్ చేశాడు. ప్రస్తుతం జట్టు ఈ గాయాల కారణంగా పెద్ద తలనొప్పి ఎదుర్కొంటోందన్న ద్రావిడ్.. ఇది జట్టుకు మంచిది కాదని అభిప్రాయపడ్డాడు. రోహిత్ లేకపోతే అతని స్థానంలో మూడో వన్డేలో జట్టుకు కేఎల్ రాహుల్ సారధ్యం వహిస్తాడు. ఓపెనర్గా మరోసారి విరాట్ కోహ్లీ వచ్చే అవకాశం ఉంది.